అఖిల్ సినిమాలను ఓటీటీకి ఇస్తారా..?

కరోనా సెకండ్ వేవ్ లో స్టార్ హీరోలెవరూ కూడా ఓటీటీల వైపు చూడడం లేదు. కాస్త బజ్ ఉన్న సినిమాలకు మంచి బేరం కుదిరితే ఓటీటీలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతానికైతే చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా అక్కినేని అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఓటీటీలోకి రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదని.. సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు మేకర్లు.

కానీ ఇప్పుడు సినిమాను ఓటీటీకి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు నిర్మాత బన్నీ వాసు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ పాట కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో రిలీజ్ ఆలస్యమైంది. అయితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఎదురుచూసి అప్పటికీ థియేటర్ల పరిస్థితి సెట్ కాకపోతే ఓటీటీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు బన్నీ వాసు చెప్పుకొచ్చారు.

ఈ సినిమాతో పాటు అఖిల్ నటిస్తోన్న మరో సినిమాకి సంబంధించి కూడా ఓటీటీ ప్రయత్నాలు జరుగుతున్నాయట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ‘ఏజెంట్’ సినిమాకు ఏదైనా ఓటీటీ సంస్థ నిర్మాణ భాగస్వామిగా చేరితే.. సదరు సంస్థకు డైరెక్ట్ రిలీజ్ కింద సినిమాను ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఫీలర్లు వచ్చాయి. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించారు.