ఆర్జీవీ సైన్స్ ఫిక్షన్ సినిమా!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు తన కెరీర్ లో క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ స్టోరీలతో ఎక్కువ సినిమాలను తెరకెక్కించారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో వర్మ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా ఏ సినిమా రాలేదు. తక్కువ బడ్జెట్ లో చిత్రవిచిత్రమైన కథలతో నాసిరకం సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ విషయంలో వర్మపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఆయన మాత్రం తన తీరుని మార్చుకోవడం లేదు. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘డి కంపెనీ’ సినిమాను స్పార్క్ ఓటీటీలో విడుదల చేశారు.

మాఫియా, గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు వర్మ. ఇదిలా ఉండగా.. వర్మ తొలిసారి కొత్త జోనర్ లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు..? సినిమా ఎప్పుడు పట్టాలెక్కుంతుందనే విషయాలను మాత్రం చెప్పలేదు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే జోనర్ లో కొన్ని సినిమాలను రూపొందిస్తున్నారు. మరి వర్మ కాన్సెప్ట్ ఎంత భిన్నంగా ఉంటుందో చూడాలి. ఇదే ఇంటర్వ్యూలో వర్మను తన ఫ్యామిలీ గురించి ప్రశ్నించగా.. చాలా ఏళ్ల క్రితమే తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని.. తనకు నచ్చింది చేసుకోమని వదిలేశారని చెప్పారు. తన కూతురైతే ‘జూ’లో ఉండే ఒక వింత జీవిని చూసినట్లు చూస్తుందని వర్మ చెప్పుకొచ్చారు.