కోలీవుడ్ టు టాలీవుడ్.. ఎందుకిలా?


తెలుగు హీరోలు త‌మిళ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డం కొత్తేమీ కాదు. బాల‌చంద‌ర్, మ‌ణిర‌త్నం, కేఎస్ ర‌వికుమార్, ధ‌ర‌ణి, విక్ర‌మ‌న్‌, మురుగ‌దాస్ ఇలా చాలామంది ప్ర‌ముఖ త‌మిళ డైరెక్ట‌ర్లు తెలుగులో సినిమాలు చేసిన వాళ్లే. ఐతే గ‌త కొన్నేళ్ల‌లో ఈ ఒర‌వ‌డి త‌గ్గుతూ వ‌చ్చింది. కోలీవుడ్ ద‌ర్శ‌కుల ప‌ట్ల మ‌న హీరోల మోజు త‌గ్గుతూ వ‌చ్చింది. ఐతే ఇప్పుడు ఉన్న‌ట్లుండి త‌మిళ టాప్ డైరెక్ట‌ర్లు ఒక్కొక్క‌రుగా ఇటు చూస్తున్నారు. ఇంత‌కుముందు మ‌న హీరోల‌కు దొర‌క‌ని వాళ్లు సైతం ఇప్పుడు ఇక్క‌డ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ శంక‌ర్.

శంక‌ర్‌తో ప‌ని చేయ‌డానికి చిరంజీవి సైతం అమిత‌మైన ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించాడు. బ‌హిరంగంగానే త‌న కోరిక‌ను వెల్ల‌డించాడు. ఇంకా చాలామంది టాలీవుడ్ స్టార్లు శంకర్‌తో ప‌ని చేయాల‌ని ఆశ ప‌డ్డ వాళ్లే. కానీ టాప్ ఫాంలో ఉండ‌గా చిరు స‌హా ఏ టాలీవుడ్ హీరోతోనూ ప‌ని చేయ‌ని శంక‌ర్.. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌తో సినిమాకు ఓకే చెప్పాడు. ఐతే శంక‌ర్ ఒక‌ప్ప‌టంత ఊపులో లేని మాట వాస్త‌వం. ఐ, 2.0 చిత్రాలు ఆయ‌న స్థాయికి త‌గ‌నివే. మ‌రో చిత్రం ఇండియ‌న్-2 అయోమ‌యంలో ప‌డ్డ స్థితిలో శంక‌ర్.. చ‌ర‌ణ్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు.

ఇక రామ్‌తో సినిమా చేస్తున్న లింగుస్వామి ప‌రిస్థితి అయితే మ‌రీ ఇబ్బందిక‌రం. సికింద‌ర్, పందెంకోడి-2 లాంటి డిజాస్ట‌ర్ల త‌ర్వాత అత‌ను రామ్‌తో జ‌ట్టు క‌ట్టాడు. మ‌రో పెద్ద ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ సైతం రామ్‌తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆయ‌న‌కు సైతం త‌మిళంలో డిమాండ్ త‌గ్గింది. విజ‌య్‌తో సినిమా క్యాన్సిల్ అయి ఇబ్బందుల్లో ఉండ‌గా రామ్‌తో సినిమా చేయ‌డానికి స‌రే అన్న‌ట్లు క‌నిపిస్తోంది. వీళ్ల కంటే ముందు త‌మిళంలో పూర్తిగా అవ‌కాశాలు ఆగిపోయిన కె.ఎస్.ర‌వికుమార్.. బాల‌కృష్ణ‌తో వ‌రుస‌గా రెండు సినిమాలు చేయ‌డం తెలిసిందే. చూస్తుంటే త‌మిళంలో డిమాండ్ త‌గ్గిన నేప‌థ్యంలోనే అక్క‌డి సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు తెలుగు హీరోల వైపు చూస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.