రాజేంద్రుడు గోల్డ్ మెడల్‌తో ఎన్టీవోడి దగ్గరికెళ్తే..

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గన నటుల్లో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. కామెడీకి ఒక స్థాయి తీసుకొచ్చి.. కామెడీతోనూ హీరోగా ఎదగొచ్చని రుజువు చేసిన ప్రత్యేకమైన నటుడు రాజేంద్ర ప్రసాద్. ఐతే ఆయన తెరంగేట్రం, ఎదుగుదల అంత సాఫీగా ఏమీ సాగిపోలేదు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు నుంచే వచ్చినా, ఎన్టీఆర్ కుటుంబంతో తమ కుటుంబానికి పరిచయం ఉన్నా తాను కూడా కెరీర్ ఆరంభంలో చాలానే ఇబ్బందులు పడ్డట్లు రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా తాను మద్రాసులోని ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకుని ఎన్టీఆర్‌ను కలిస్తే ఆయన అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగిపోయి అయోమయంలో పడ్డట్లు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

“నేను ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాసైనప్పటికీ నటనలోకి వెళ్లాలనుకుంటే మా నాన్నగారు మద్రాస్‌లోని పేరున్న ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. అక్కడ గోల్డ్ మెడల్ తీసుకుని ఎన్టీఆర్ గారిని కలిశాను. గోల్డ్ మెడల్ తీసుకున్నా కాబట్టి నేను నటన పట్ల సీరియస్‌గానే ఉన్నానని ఆయన అర్థం చేసుకున్నారు. కానీ తర్వాత ఆయనో ప్రశ్న అడిగారు. ‘రాముడు, కృష్ణుడు పాత్రలకు నన్ను అడుగుతారు. ఏవైనా సోషల్ సినిమాలుంటే ఏఎన్నార్ వైపు చూస్తారు. యాక్షన్ సినిమాలంటే కృష్ణ.. రొమాంటిక్ చిత్రాలంటే శోభన్ బాబు ఉన్నారు. ఇలా మా అందరికీ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇలా ప్రతి ఒక్కరికీ ఒక స్పెషాలిటీ ఉండాలి. మరి నీ ప్రత్యేకత ఏముంది? నిర్మాతలు దేని కోసం నీతో సినిమా తీయాలి’ అన్నారు.


ఆ మాటకు నాకు నోట మాట రాలేదు. గోల్డ్ మెడల్ తీసుకున్నానని గాల్లో తేలిపోతుంటే ఆయన నా నెత్తిన పెద్ద గుదిబండ వేశారు. దాంతో నాకు పిచ్చెక్కిపోయింది. వారం రోజుల పాటు పిచ్చోడిలా మద్రాస్ రోడ్ల వెంబడి తిరిగాను. అలాంటి సమయంలో నా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ సహచరులు చార్లి చాప్లిన్ సినిమా వారోత్సవాలకు తీసుకెళ్లారు. వారం పాటు ఆయన సినిమాలన్నీ చూశాను. అవి చూశాక నిర్ణయించుకున్నా. మనం కామెడీ సినిమాలు చేయాలి. మనం కామెడీ హీరోగా ఎందుకు పేరు తెచ్చుకోకూడదు అని. తర్వాత అవే చేసి పైకొచ్చా’’ అని రాజేంద్ర ప్రసాద్ వివరించారు.