మహేష్-త్రివిక్రమ్.. లెక్కలు సరిచేయాలి


మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మూడో సినిమా రాబోతోంది. ఇది వాళ్లిద్దరి అభిమానులనూ ఎగ్జైట్ చేసే విషయమే. మామూలుగా హిట్ కాంబినేషన్ మీదే ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఐతే ఆశ్చర్యకరంగా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి రెండు సినిమాలు కమర్షియల్‌గా నిరాశ పరిచినా సరే.. అంచనాలేమీ తక్కువగా లేవు. అందుక్కారణం వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు ‘ఎవర్ గ్రీన్’ స్టేటస్ అందుకోవడమే.

తొలిసారిగా మహేష్, త్రివిక్రమ్ కలిసి చేసిన ‘అతడు’ను తెలుగు సినీ చరిత్రలోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా పేర్కొంటారు. ఐతే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదు. నిర్మాత మురళీ మోహన్‌కు కొంత మేర నష్టాలు కూడా తెచ్చింది. ఐతే థియేటర్లలో ఉన్నప్పుడు ఓ మోస్తరుగా ఆడిన సినిమా కాస్తా.. టీవీల్లోకి రాగానే విపరీతంగా జనాలను ఆకట్టుకోవడం మొదలైంది. ఇప్పటికీ ‘అతడు’ సినిమా టీవీల్లో వస్తుంటే కళ్లప్పగించి చూస్తుంటారు జనాలు.

ఇక మహేష్, త్రివిక్రమ్ కలిసి చేసిన రెండో సినిమా ‘ఖలేజా’ అయితే థియేటర్లలో డిజాస్టరే అయింది. భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఐతేనేం.. ఈ సినిమా సైతం టీవీల్లో, యూట్యూబ్‌లో తిరుగులేని ఆదరణ సంపాదించుకుని క్లాసిక్ స్టేటస్ తెచ్చుకోవడం విశేషం. ఐతే ఈసారి మాత్రం మహేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చే సినిమా ఈ కోవలో చేరకూడదని అభిమానులు బలంగా కోరుకుంటుున్నారు.

సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయాక క్లాసిక్ స్టేటస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని.. పెద్ద తెర మీదే ప్రేక్షకులను అలరించాలని.. కమర్షియల్‌గానూ మంచి విజయం సాధించి గత రెండు సినిమాల లోటును భర్తీ చేయాలని మహేష్, త్రివిక్రమ్ అభిమానులు ఆశిస్తున్నారు. త్రివిక్రమ్, మహేష్ ఇద్దరూ కూడా ఇప్పుడు మంచి ఫాంలోనే ఉన్నారు. పైగా మంచి రికార్డున్న హారిక హాసిని బేనర్లో సినిమా తెరకెక్కుతోంది. కాబట్టి ఈసారి తప్పు జరగదని.. ఈ కాంబినేషన్ పాత లెక్కలన్నీ సరి చేయడం గ్యారెంటీ అనే ఆశిద్దాం.