పవన్‌కు నో చెప్పి.. పవన్ ఫ్యాన్‌తో?


టాలీవుడ్ యువ కథానాయకుల్లో సక్సెస్ పరంగా ఎప్పుడూ నిలకడ చూపించలేని హీరోల్లో నితిన్ ఒకడు. ఒకటో రెండో హిట్లు పడ్డాయంటే చాలు.. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు వస్తాయతడికి. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలతో ఒకప్పుడు మంచి ఊపు మీద కనిపించిన నితిన్.. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులతో అల్లాడాడు.

‘అఆ’తో మళ్లీ పుంజుకున్నట్లే కనిపించాడు. కానీ మళ్లీ ఫ్లాపులు వెంటాడాయి. గత ఏడాది ‘భీష్మ’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడులే అనుకుంటే.. ఈ మధ్యే నెల వ్యవధిలో రెండు ఫ్లాపులు ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరిలో వచ్చిన ‘చెక్’ పూర్తిగా నిరాశ పరిస్తే.. తర్వాతి నెలలో వచ్చిన ‘రంగ్ దె’ ఆరంభంలో జోరు చూపించి, ఆ తర్వాత చల్లబడిపోయింది. చివరికి అది కూడా ఫ్లాపుగానే తేలింది. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘మేస్ట్రో’ మీదే ఉన్నాయి. బాలీవుడ్ మూవీ ‘అంధాదున్’కు రీమేక్ అయిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

‘మేస్ట్రో’ చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. నితిన్ తన తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ముందు అనుకున్నట్లు కృష్ణచైతన్యతో ‘పవర్ పేట’ను కాకుండా.. వక్కంతం వంశీతో ఓ సినిమాను మొదలుపెడుతున్నాడు నితిన్. ‘క్రాక్’ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కథ, పాత్ర చెప్పి సాయిపల్లవిని ఒప్పించాడట వంశీ.

సాయిపల్లవి సినిమా చేయడానికి ఒప్పుకుందంటేనే ఈ కథలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందన్న అభిప్రాయం జనాల్లో కలుగుతుంది. ఆమె సినిమాల ఎంపికలో ఎంత సెలెక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. పాత్ర పట్ల సంతృప్తి చెందకపోవడం వల్లో లేక డేట్లు సర్దుబాటు చేయకపోవడం వల్లో కానీ.. ఆమె ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమానే కాదంది. ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ నుంచి సాయిపల్లవి తప్పుకోవడం తెలిసిందే. పవన్‌‌కు నో చెప్పి ఇప్పుడు పవన్ ఫ్యాన్ అయిన నితిన్ సినిమాకు ఆమె ఓకే చెప్పడం విశేషమే.