చావు కబురు చల్లగా.. ఈ హడావుడేంటో?

ఒక కొత్త సినిమా రిలీజై, ఫ్లాప్ టాక్ తెచ్చుకుని, థియేటర్ల నుంచి వెళ్లిపోయాక దాని గురించి మళ్లీ ఏ చర్చా ఉండదు. సినిమాకు టాక్ ఎలా ఉన్నా రిలీజయ్యాక కొన్ని రోజుల వరకు ప్రమోషన్ హడావుడి చేస్తారు కానీ.. ఆ చిత్రం పూర్తిగా థియేటర్ల నుంచి నిష్క్రమించాక రిలీజైన నెల రోజుల తర్వాత టీం ప్రెస్ మీట్ పెట్టడం, సినిమా గురించి మంచి మాటలు చెప్పడం, దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.

‘చావు కబురు చల్లగా’ టీం ఇప్పుడు అదే చేస్తోంది. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ ముందు ఉన్న బజ్ వల్ల కాస్త ఓపెనింగ్స్ వచ్చాయి తప్ప సినిమా అస్సలు నిలబడలేకపోయింది. వీకెండ్ అవ్వగానే అడ్రస్ లేకుండా పోయింది. రెండో వారానికి సినిమా ఎక్కడా థియేటర్లలో కనిపించలేదు. ఐతే ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘ఆహా’లో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో మళ్లీ ఇప్పుడు చిత్ర బృందం హడావుడి చేస్తుండటం విశేషం.

థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమా.. ఓటీటీలో రిలీజవుతుంటే దానికి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టడం చిత్రంగానే అనిపిస్తోంది. హీరో కార్తికేయ, దర్శకుడు కార్తీక్ పెగళ్లపాటి ఇందులో పాల్గొని తమ సినిమా గురించి ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ‘చావు కబురు చల్లగా’ సరిగా ఆఢలేదన్న విషయాన్ని ఒప్పుకున్న కార్తికేయ.. సినిమాకు ఓ వర్గం నుంచి మాత్రం ప్రశంసలు దక్కాయన్నాడు. పెర్ఫామెన్స్ పరంగా తనలో కొత్త కోణం చూశారని, మంచి కథలు తనను వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పాడు. సినిమాను మళ్లీ ఎడిట్ చేసి రిలీజ్ చేశామని, థియేటర్లలో చూసిన దాని కంటే ఈ వెర్షన్ మెరుగ్గా ఉంటుందని చెప్పాడు.

సోషల్ మీడియాలో కూడా ‘ఆహా’లో ‘చావు కబురు చల్లగా’ రిలీజ్ గురించి హడావుడి మామూలుగా లేదు. ఓ కొత్త సినిమా నేరుగా ఓటీటీలో రిలీజవుతున్నట్లే చేస్తున్నారు. ఇది అల్లు వారి సొంత సినిమా కావడంతో డిజాస్టర్ అయినా దాన్ని అంగీకరించకుండా, ‘ఆహా’ ద్వారా సాధ్యమైనంత ఎక్కువమందికి సినిమా చూపించాలని కంకణం కట్టుకున్నట్లే ఉన్నారు. థియేటర్ల నుంచి రెవెన్యూ రాకపోయినా ‘ఆహా’కైనా దీని ద్వారా ప్రయోజనం దక్కేలా చూద్దామనే ఈ ప్రయత్నం కావచ్చు.