ఏపీ థియేట‌ర్ల‌లో ఇక‌ 50 శాతమే


అనుకున్న‌దే అయింది. క‌రోనా సెకండ్ వేవ్ ఉద్దృతి నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ప‌రిమితిని 50 శాతానికి త‌గ్గించేశారు. కేవ‌లం ఆక్యుపెన్సీని 50 శాతానికి త‌గ్గిస్తే స‌రిపోదు. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు ఎలా ప‌డితే అలా కూర్చోవ‌డానికి వీల్లేదు. ప్ర‌తి రెండు సీట్ల మ‌ధ్య ఒక సీటు ఖాళీ ఉంచాల్సిందే. ఈ విష‌యంలో నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాల నుంచి థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు ఆదేశాలు అందాయి.

గ‌త రెండు మూడు వారాల్లో దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఉద్ధృతి అమాంతం పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మిన‌హాయింపు కాదు. ఏపీలో తిరుప‌తి ఉప ఎన్నిక‌ అవ్వ‌గానే థియేట‌ర్ల‌లో ఆక్యుపెన్సీని 50 శాతానికి త‌గ్గించ‌డంతో పాటు అనేక ష‌ర‌తులు పెడ‌తార‌న్న సంకేతాలు కొన్ని రోజుల ముందు నుంచే వ‌స్తున్నాయి. ఇప్పుడు లాంఛ‌నంగా ఆ నిర్ణ‌యాన్ని అమ‌ల్లో పెట్టారు. మ‌రోవైపు ఏపీలో విద్యా సంస్థ‌ల‌న్నింటినీ మూసి వేయాల‌ని కూడా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే పాఠ‌శాల‌ల‌న్నింటినీ మూసి వేసిన సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ‌లో సైతం నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక అవ్వ‌గానే థియేట‌ర్ల‌లో ఆక్యుపెన్సీని 50 శాతానికి త‌గ్గించ‌డంతో పాటు మ‌రిన్ని ష‌ర‌తులు తేవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీనిపై కొన్ని రోజుల ముందే సంకేతాలు రావడంతోనే వ‌కీల్ సాబ్ త‌ర్వాత షెడ్యూల్ అయిన పేరున్న సినిమాల‌ను వాయిదా వేయ‌డం మొద‌లైంది. ఏపీలో టికెట్ల ధ‌ర‌ల‌పై నియంత్ర‌ణ నేప‌థ్యంలో చాలా చోట్ల థియేట‌ర్ల‌ను ఇప్ప‌టికే స్వ‌చ్ఛందంగా మూసి వేస్తున్నారు. ఇక ఆక్యుపెన్సీని 50 శాతానికి త‌గ్గించ‌డం, పేరున్న సినిమాలు లేక‌పోవ‌డంతో మ‌రిన్ని థియేట‌ర్లు మూత ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.