వంశీ పైడిపల్లి.. కొత్త టార్గెట్


తెలుగులో వంద కోట్ల షేర్ సాధించిన సినిమాను అందించిన దర్శకుడు.. ఆ సినిమా రిలీజైన రెండేళ్ల తర్వాత కూడా మరో చిత్రం మొదలుపెట్టకుండా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వంశీ పైడిపల్లి విషయంలో ఇదే జరిగింది. రెండేళ్ల కిందట సమ్మర్ సీజన్లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘మహర్షి’ అతడి సినిమానే అన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం చేస్తున్నపుడే వంశీతో ఇంకో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు మహేష్ బాబు. కానీ సూపర్ స్టార్‌ను మెప్పించే స్క్రిప్టు తయారు చేసుకోలేకపోవడంతో వంశీకి మొండిచేయి తప్పలేదు. దీని స్థానంలోనే ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు మహేష్.

అంత పెద్ద స్టార్‌తో సినిమా చేశాక వంశీ స్థాయి తగ్గించుకోలేడు. మిగతా పెద్ద స్టార్లందరినీ ట్రై చేసి చూశాడు కానీ.. ఎవ్వరూ అతడికి పచ్చ జెండా ఊపలేదు. దీంతో అతను అయోమయంలో పడిపోయాడు.

ఒకసారి రామ్ చరణ్‌ను కూడా ప్రయత్నించి విఫలమైన వంశీ.. ఇప్పుడు అతడి తండ్రి మెగాస్టార్‌ మీద గురి పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య చిరు సినిమాల ఎంపికలో మరీ ఉదారంగా ఉంటున్నాడు. దర్శకుల ట్రాక్ రికార్డు చూడట్లేదు. బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులకు ఆయన అవకాశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మెహర్‌కే ఛాన్స్ ఇచ్చాక వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడితో పని చేయడానికి చిరుకు అభ్యంతరం లేకపోవచ్చు.

‘ఆహా’ కోసం అల్లు అరవింద్‌తో కలిసి పని చేస్తున్న వంశీకి.. చిరు దగ్గరికి ఈజీగానే యాక్సెస్ దొరికిందట. మెగాస్టార్‌కు వంశీ ఇటీవలే ఓ కథ కూడా చెప్పాడట. ఐతే ఆయనకు కథ నచ్చిందా.. దానిపై నిర్ణయం ఏంటన్నది తెలియదు. చిరు ఓకే అంటే వంశీ టెన్షన్ తీరిపోయినట్లే. ప్రస్తుతం చిరు ‘ఆచార్య’తో పాటు ‘లూసిఫర్’ రీమేక్‌లోనూ నటిస్తున్నాడు. ఈ ఏడాదే బాబీ, మెహర్ రమేష్ సినిమాలనూ మొదలుపెట్టాలనుకుంటున్నాడు.