‘పుష్ప’ కోసం ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్

‘రంగస్థలం’తో నాన్ బాహుబలి హిట్ అందుకున్నాడు అగ్ర దర్శకుడు సుకుమార్. ఆ సినిమా రికార్డును ‘అల వైకుంఠపురములో’తో బద్దలు కొట్టాడు అల్లు అర్జున్. ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కతున్న ‘పుష్ప’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన కెరీర్లోనే అత్యధిక సమయం వెచ్చించి ఈ సినిమాకు స్క్రిప్టు సిద్ధం చేశాడు సుకుమార్. విపరీతమైన కసరత్తు తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించాడు. తన విజన్‌కు తగ్గట్లు సినిమాను తెరపై ప్రెజెంట్ చేయడం కోసం టాప్ టెక్నీషియన్లను తీసుకుంటున్నాడు సుకుమార్.

రత్నవేలు అందుబాటులో లేకపోయినా.. ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్‌కు పరిచయం అయిన పోలెండ్ సినిమాటోగ్రాఫర్ స్కూబాకు ఛాయాగ్రహణ బాధ్యతలు ఇచ్చాడు. అతడి విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో ఇటీవల రిలీజైన ‘పుష్ప’ ఫస్ట్ గ్లింప్స్‌తోనే స్పష్టమైంది. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సైతం అదిరిపోయే ఔట్‌పుట్ ఇచ్చాడని ఆ ఫస్ట్ గ్లింప్స్‌లోనే అర్థమైంది.

ఇప్పుడీ చిత్రం కోసం మరో టాప్ టెక్నీషియన్‌ను తీసుకున్నారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు సౌండ్ డిజైనింగ్‌లో ఏకంగా ఆస్కార్ అవార్డును అందుకున్న రసూల్ పొకుట్టిని ‘పుష్ప’ కోసం ఎంచుకున్నాడు సుకుమార్. ఎక్కువగా అటవీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సౌండ్ డిజైనింగ్ చాలా కీలకంగా ఉంటుంది. అందులో ప్రతి శబ్దాన్నీ క్యాప్చర్ చేసి మంచి క్వాలిటీతో అందిస్తే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి అందుతుంది. తెలుగులో ఈ తరహా చిత్రాలు అరుదు. అందుకే సుకుమార్ రసూల్ లాంటి టాప్ టెక్నీషియన్‌ను ఎంచుకున్నట్లున్నాడు.

ఇటీవలే విడుదలైన ‘అరణ్య’ సినిమాకు రసూల్ సౌండ్ డిజైనింగ్ చేశాడు. ఆ సినిమాలో ఆయన పనితనం గురించి అందరూ మాట్లాడుకున్నారు. బహుశా సుకుమార్ కూడా ఆ సినిమా చూశాకే రసూల్‌తో పని చేయడానికి ఆసక్తి చూపి ఉండొచ్చు. ‘అరణ్య’ తరహాలోనే ‘పుష్ప’ సైత అటవీ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో రసూల్‌ను సుకుమార్ ఎంచుకున్నట్లున్నాడు.