నాగ్.. అఖిల్.. ఒక యాక్షన్ మూవీ


ఈ హెడ్డింగ్ చూడగానే.. ఈ తండ్రీ కొడుకుల కాంబినేన్ ఎప్పుడు చూడబోతున్నాం.. దాని దర్శకుడు ఎవరు.. ఏ సంస్థ నిర్మించబోతోంది.. అన్న సందేహాలు కలగొచ్చు. ఐతే అప్పుడే అంతగా అంచనాల్లోకి వెళ్లిపోకండి. ఇది జస్ట్ ఒక ఊహ మాత్రమే. ఈ మాట నాగార్జున నుంచే వచ్చింది మరి.

వందో సినిమాకు ఎలా ప్లాన్ చేస్తున్నారు.. అఖిల్‌ కూడా అందులో నటిస్తాడట కదా అని నాగార్జునను ‘వైల్డ్ డాగ్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూల సందర్భంగా మీడియా వాళ్లు అడిగితే.. నాగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. వందో సినిమా కచ్చితంగా హిట్టయ్యేలా చూసుకోవాలని అనుకుంటున్నానని.. ఆ రకంగానే ప్లానింగ్ జరుగుతోందని.. ఐతే అందులో అఖిల్ నటిస్తాడా లేదా అన్నది చెప్పలేనని.. దానికింకా సమయం ఉందని నాగ్ అన్నాడు. ఐతే తనకైతే అఖిల్‌తో మంచి యాక్షన్ సినిమా చేయాలని ఆశగా ఉందని నాగ్ తెలిపాడు.

ఇక తాను నటిస్తున్న, నటించబోయే సినిమాల గురించి నాగ్ చెబుతూ.. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ ఈ ఏడాది తన నుంచి రాబోతున్న ఎగ్జైటింగ్‌ మూవీస్‌లో ఒకటని నాగ్ అన్నాడు. ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని.. అరగంటకు కాస్త ఎక్కువ నిడివితో తన పాత్ర ఉంటుందని.. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందని చెప్పగలనని నాగ్ అన్నాడు. మూడు భాగాలుగా ‘బ్రహ్మాస్త్ర’ను ప్లాన్ చేసినట్లు నాగ్ వెల్లడించాడు.

తెలుగులో ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నానని.. జులైలో చిత్రీకరణ పూర్తవుతుందని.. మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తామని చెప్పాడు. ‘బంగార్రాజు’ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు స్కోప్ ఉందని అనిపిస్తే ఈ ఏడాదే ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని చెప్పాడు నాగ్. అలా కాని పక్షంలో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఆయన స్పష్టత ఇవ్వలేదు.