ఈ థ్రిల్లర్ మూవీ అమితంగా ఆకర్షిస్తోంది

రెండు నెలలుగా థియేటర్లు మూతబడి ఉండటంతో ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తోంది. జనాలు వెతికి వెతికి సినిమాలు చూస్తున్నారు ఆన్ లైన్లో. భాషా భేదం లేకుండా ఎక్కడ మంచి సినిమా ఉన్నా వదలట్లేదు. ఇలాంటి టైంలో దక్షిణాది ప్రేక్షకుల్ని ఓ మలయాళ థ్రిల్లర్ మూవీ అమితంగా ఆకర్షిస్తోంది. ఆకట్టుకుంటోంది. ఆ సినిమానే.. అంజామ్ పత్తిర.

కుంచకో బోబన్ హీరోగా మిథున్ మాన్యువల్ థామస్ రూపొందించిన సినిమా ఇది. గత ఏడాది తమిళం నుంచి తెలుగులోకి రీమేక్ అయిన ‘రాక్షసుడు’ తరహా ఇంటెన్స్ థ్రిల్లర్‌గా చెప్పొచ్చు ఈ సినిమాను. వివిధ భాషల్లో సీరియల్ కిల్లర్ సినిమాలు చాలా చూసి ఉంటాం. ఐతే దీని ప్రత్యేకతే వేరు. తొలి సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు ఉత్కంఠ రేపుతూ.. ప్రేక్షకులకు షాకుల మీద షాకులు ఇస్తూ.. గుక్క తిప్పుకోనివ్వని స్క్రీన్ ప్లేతో నడుస్తుందీ సినిమా.

‘అంజామ్ పత్తిర’లో హీరో ఒక క్రిమినాలజీ సైకియాట్రిస్ట్. అతను క్లినిక్ నడుపుతూ పేషెంట్లకు చికిత్స అందిస్తూనే.. మరోవైపు సైకో కిల్లర్ల మీద పరిశోధన జరుపుతుంటాడు. అతడికి పోలీస్ డిపార్ట్‌మెంట్లో పని చేసే అవకాశం వస్తుంది. అక్కడ అడుగు పెట్టగానే ఓ కేసు అతడికి సవాలు విసురుతుంది. ఒక పోలీస్ అధికారి కిడ్నాప్ అవుతాడు. తర్వాతి రోజు అతడి కళ్లు, గుండెకాయ తీసి.. చంపేసి పడేస్తారు. బతికుండగానే వాటిని బయటికి తీసినట్లు ఫోరెన్సిక్ నిపుణుడు చెబుతాడు. ఆ తర్వాత వరుసగా ఇదే తరహాలో ఇంకో ముగ్గురు పోలీస్‌లు కిడ్నాప్ అవుతారు. వారిని కూడా అలాగే హింసించి చంపేస్తారు. ప్రతి హత్యలోనూ ఒక ప్యాటర్న్ పాటించిన హంతకుడు.. ఒక క్లూ కూడా వదులుతాడు. దీని వెనుక ఎవరున్నది హీరోనే ఛేదిస్తాడు. కానీ ఆ క్రమంలో అనేక మలుపులుంటాయి. క్షణ క్షణం ఉత్కంఠ రేపుతూ కథనం నడుస్తుంది.

ఈ ఏడాది మలయాళంలో టాప్ రేటెడ్ మూవీగా నిలిచిందీ సినిమా. వసూళ్లలోనూ టాప్‌లో నిలిచింది. ఈ చిత్రం ‘సన్ నెక్స్ట్’లో స్ట్రీమ్ అవుతోంది.