సాయిపల్లవి స్థానంలోకి నిత్యా మీనన్?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ను పూర్తి చేశాక ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘హరి హర వీరమల్లు’ కాగా.. ఇంకోటి మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్. ఇటీవలే మీడియాను కలిసి ఈ చిత్ర నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ.. ఈ సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయినట్లు వెల్లడించాడు. ఇంత షూటింగ్ అయినా ఇప్పటికీ పవన్ సరసన నటించే హీరోయిన్ మాత్రం ఇంకా ఖరారవ్వలేదు.

ఒరిజినల్లో ఓ కొత్తమ్మాయి నటించిన ఈ కీలక పాత్రకు ముందు సాయిపల్లవిని ఎంచుకున్నారు. కానీ ఆమె డేట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇందులో రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నట్లుగా వంశీ ధ్రువీకరించాడు కానీ.. పవన్‌కు జోడీగా చేయాల్సిన అమ్మాయి ఇంకా ఖరారవ్వలేదని స్పష్టం చేశాడు. దీంతో సాయిపల్లవి ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి నిజమే అని రూఢి అయింది.

ఐతే త్వరలోనే ఈ పాత్రకు సంబంధించి చిత్రీకరణ మొదలుపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేయడానికి వీల్లేకపోయింది. సాధ్యమైనంత త్వరగా ఆ పాత్రను పోషించే నటిని ఖరారు చేయాల్సిన స్థితిలో నిత్యా మీనన్‌ను ఓకే చేసినట్లు తాజా సమాచారం. బాగా పెర్ఫామ్ చేయగల నటే ఈ పాత్రను చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిత్యా మీనన్ పర్ఫెక్ట్ అని డిసైడయ్యారట.

ఐతే ఇప్పటిదాకా తెలుగులో నాని, నితిన్ లాంటి యువ కథానాయకులతోనే నటించిన నిత్య.. పవన్ సరసన నటించడానికి అంగీకరించడం విశేషమే. ఆమెకు ముందులా తెలుగులో క్రేజ్ లేదు. అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్ హీరో అయినా సరే.. పవన్ సరసన ఛాన్స్ రావడమంటే గొప్ప విషయమే. పైగా నిత్య కోరుకునేట్లే ఇది పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో ఆమె తిరస్కరించలేకపోయినట్లుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడన్న సంగతి తెలిసిందే.