ముంచుపై గుమ్మ‌కొండ ఆధిప‌త్యం

18 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాడు మంచు విష్ణు. కెరీర్ ఆరంభంలో స్ట్ర‌గులైనా.. ఢీతో ప‌ట్టాలెక్కిన‌ట్లే క‌నిపించాడు. కానీ త‌ర్వాత మ‌ళ్లీ ఇబ్బందులు త‌ప్ప‌లేదు. మ‌ధ్య‌లో దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాల‌తో మ‌ళ్లీ ఫామ్ అందుకున్న‌ట్లే క‌నిపించాడు. కానీ ఆ ఊపును కొన‌సాగించ‌డంలో మ‌ళ్లీ విఫ‌ల‌మ‌య్యాడు. గ‌త కొన్నేళ్ల‌లో విష్ణు సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లే అయ్యాయి.

ఒక ద‌శ‌లో అత‌డి సినిమాల ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి స‌న్న‌గిల్లిపోయింది. కానీ ఇప్పుడు అత‌ణ్నుంచి వ‌స్తున్న మోస‌గాళ్ళు కొంత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దీని ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా అనిపించింది. ర‌స‌వ‌త్త‌ర‌మైన థ్రిల్ల‌ర్ చూడ‌బోతున్న ఫీలింగ్ క‌లిగించింది. కానీ విష్ణు గ‌త సినిమాల ప్ర‌భావం వ‌ల్లో ఏమో మోస‌గాళ్ళుకు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో క‌నిపించ‌డం లేదు.

ఈ శుక్ర‌వారం మోస‌గాళ్ళుతో పాటు కార్తికేయ గుమ్మ‌కొండ హీరోగా న‌టించిన చావు క‌బురు చ‌ల్ల‌గా, ఆది సాయికుమార్ మూవీ శ‌శి కూడా విడుద‌ల‌వుతునాయి. ఈ మూడింట్లోకి అడ్వాన్స్ బుకింగ్స్ విష‌యంలో చావు క‌బురు చ‌ల్ల‌గానే పైచేయి సాధిస్తోంది. అల్లు అర‌వింద్ ప్రొడ్యూస్ చేసిన సినిమా కావ‌డంతో దీనికి థియేట‌ర్లు కూడా ఎక్కువ సంఖ్య‌లో దొరికాయి.

శ‌వాల వ్యాన్ డ్రైవ‌ర్ అయిన కుర్రాడు.. త‌న భ‌ర్త చ‌నిపోయిన శోకంలో ఉన్న అమ్మాయిని ప్రేమించ‌డం అనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల దృష్టిని బాగానే ఆక‌ర్షిస్తున్న‌ట్లుంది. దీని ప్రోమోల‌న్నీ బాగా ఆక‌ట్టుకున్నాయి. సినిమా ప్రామిసింగ్‌గా క‌నిపిస్తోంది. మోస‌గాళ్ళు కూడా ట్రైల‌ర్‌తో ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ.. బ‌జ్ మాత్రం కార్తికేయ చిత్రానికే ఎక్కువ క‌నిపిస్తోంది. శ‌శి ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఏమంత ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. దాని రిలీజ్ కూడా త‌క్కువ థియేట‌ర్ల‌లోనే చేస్తున్నారు. మ‌రి ఈ మూడు చిత్రాల్లో దేనికి ఎలాంటి టాక్ వ‌స్తుందో.. ఏది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పైచేయి సాధిస్తుందో చూడాలి.