శాకుంత‌లంలో అత‌నొద్ద‌న్న దిల్ రాజు

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ నుంచి రుద్ర‌మ‌దేవి త‌ర్వాత‌ రాబోతున్న మ‌రో భారీ చారిత్ర‌క చిత్రం శాకుంతలం. ఇందులో శ‌కుంత‌ల‌గా స‌మంత క‌నిపించ‌నుండ‌గా.. ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్‌ను ఎంపిక చేయ‌డం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అత‌ను మ‌ల‌యాళంలో కూడా పేరున్న న‌టుడేమీ కాదు. ఒక సినిమానే చేశాడు.

మ‌న వాళ్ల‌కు అస్స‌లు ప‌రిచ‌యం లేని కొత్త న‌టుడిని స‌మంత లాంటి స్టార్ హీరోయిన్‌కు జోడీగా పెట్ట‌డం ఏంటి అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. ఈ పాత్ర‌కు ఎవ‌రైనా స్టార్ హీరో అయితేనే బాగుంటుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మయ్యాయి. ఈ చిత్రంలో నిర్మాణ భాగ‌స్వామిగా మారిన దిల్ రాజుకు సైతం అలాంటి అభిప్రాయ‌మే క‌లిగింద‌ట‌. కానీ ఆయ‌న్ని గుణ‌శేఖ‌ర్ స‌మాధాన ప‌రిచాడ‌ట‌. శాకుంత‌లం ప్రారంభోత్స‌వ వేడుక‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం లాంటి భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసిన‌పుడు ఆయ‌న‌కు అండ‌గా ఎవ‌రైనా ఉండి, సినిమాకు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తే బాగుంటుంద‌ని తాను అభిప్రాయ‌ప‌డ్డాన‌ని.. వెంట‌నే మ‌హేంద్ర అనే వ్య‌క్తి మీరే ఎందుకు ఉండొద్ద‌ని అన్నార‌ని, తాను స‌రే అన్నాను కానీ, క‌థ విన్నాకే నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పాన‌ని రాజు తెలిపాడు.

త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ త‌న‌ను క‌లిసి క‌థ వినిపించాడ‌ని.. తాను సినిమా ఎలా తీయాల‌నుకుంటున్నానో వివ‌రించాడ‌ని.. ఆయ‌న చెప్పిన క‌థ‌ను న‌టీన‌టుల పెర్ఫామెన్స్, సాంకేతిక హంగుల‌తో క‌లిపి తాను ఊహించుకున్నాన‌ని.. అప్పుడ‌ది అద్భుతంగా అనిపించింద‌ని, గొప్ప సినిమా అవుతుంద‌న్న న‌మ్మ‌కం కుదిరింద‌ని.. వెంట‌నే తాను ఈ సినిమాలో భాగ‌స్వామి కావ‌డానికి అంగీక‌రించాన‌ని రాజు వెల్ల‌డించాడు. ఐతే దుష్యంతుడి పాత్ర వ‌ర‌కు వ‌చ్చేస‌రికి త‌న‌లోని నిర్మాత నిద్ర లేచాడ‌ని, దేవ్ కాకుండా ఎవ‌రైనా స్టార్ హీరో అయితే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాన‌ని.. కానీ అప్ప‌టికే చేసిన ఫొటో షూట్‌ను గుణ‌శేఖ‌ర్ చూపించాడ‌ని, అందులో దేవ్‌ను చూస్తే నిజంగా రాజులా అనిపించాడ‌ని, దీంతో అత‌నే ఈ పాత్ర‌కు క‌రెక్ట్ అనిపించింద‌ని దిల్ రాజు తెలిపాడు.