‘దృశ్యం’లో అలా.. నిజంగా ఏం జరిగిందో తెలుసా?

ఒక భాషలో విజయవంతం అయిన సినిమా ఇంకో భాషలో ఆడుతుందని గ్యారెంటీ లేదు. ఇలా దెబ్బ తిన్న సినిమాలు చాలానే కనిపిస్తాయి. కానీ తీసిన ప్రతి భాషలోనూ సూపర్ సక్సెస్ అయిన అరుదైన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. ముందుగా మలయాళంలో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్ అయిన ‘దృశ్యం’ను ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తే అన్ని చోట్లా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘దృశ్యం-2’ సైతం అపూర్వ ఆదరణను దక్కించుకుంటోంది.

ఇంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కథ పుట్టింది వాస్తవ ఘటనల నుంచే అంటున్నాడు దర్శకుడు జీతు జోసెఫ్. తాను ఏ కథ రాసినా.. దానికి చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు లేదంటే వార్తా కథనాల నుంచి స్ఫూర్తి పొందుతానని.. ‘దృశ్యం’ కూడా అందుకు మినహాయింపు కాదని జీతు తెలిపాడు. ఇందులో ప్రధాన పాత్రధారి అయిన జార్జి కుట్టి అనే వ్యక్తి నిజంగా ఉన్నట్లు అతను వెల్లడించాడు.

‘దృశ్యం’ తొలి భాగంలో చూపించిన హత్య.. దాన్ని మరుగుపరిచేందుకు ఓ కుటుంబం చేసే ప్రయత్నం అంతా కూడా నిజంగా జరిగిందే అని జీతు తెలిపాడు. ఐతే వాస్తవంగా ఆ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడని.. ఐతే పోలీసులకు దొరక్కుండా ఆ వ్యక్తి పకడ్బందీగా వ్యవహరిస్తే ఎలా ఉండేదన్న ఆలోచనతో తాను ‘దృశ్యం’ స్క్రిప్టు రాశానని అతను వెల్లడించాడు. ఇక జార్జి కుట్టి పాత్రలో చాలా లక్షణాలు తాను తన తండ్రి నుంచి తీసుకున్నట్లు జీతు చెప్పాడు. హీరో సినిమా పిచ్చి అంతా తన నుంచి పుట్టిందన్నాడు.

‘దృశ్యం’ చిత్రాన్ని అందరూ థ్రిల్లర్ అనుకుంటారని.. నిజానికి అది ఒక ఫ్యామిలీ డ్రామా అని.. ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకున్నది కూడా కుటుంబానికి సంబంధించిన విషయాలే అని.. భాషా భేదం లేకుండా అందరూ ఈ సినిమాతో కనెక్ట్ అయ్యారంటే కూడా ఇందులో చూపించిన సార్వజనీనమైన ఫ్యామిలీ ఎమోషన్లే కారణమని.. కుటుంబం కోసం ఓ వ్యక్తి ఎంత దూరమైనా వెళ్లడమే ప్రేక్షకులను నచ్చిందని జీతు అభిప్రాయపడ్డాడు.