‘ఉప్పెన’పై చిరంజీవి ఛాలెంజ్

‘ఉప్పెన’ కథ విని తన చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇలాంటి సినిమాతో అరంగేట్రం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కెరీర్లో ఒక స్థాయి అందుకున్నాక చిరు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేశారు.

మధ్యలో కొన్ని ప్రయోగాలు చేసినప్పికీ వాటికి ఆశించినంత స్పందన రాకపోవడంతో ఆయన ఒక దశ దాటాక పూర్తిగా మాస్ మసాలా సినిమాలకే పరిమితం అయిపోయారు. ఆయన ఓటు ఎప్పుడూ కమర్షియల్ చిత్రాలకే అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంటుంది. అలాంటిది ‘ఉప్పెన’ క్లైమాక్స్‌లో షాకింగ్‌గా అనిపించే ట్విస్టు విన్నాక ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. కేవలం ఈ కథకు పచ్చజెండా ఊపడమే కాదు.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధిస్తుందని కూడా చిరు ఎంతో ధీమాగా ఉన్నారట. బయటి వాళ్ల ఆఫర్లకు టెంప్ట్ అయి ఈ సినిమాను అమ్మేయొద్దని కూడా చిరు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలకు గట్టిగా చెప్పాడట.

‘ఉప్పెన’ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితంపై చిరంజీవి చేసిన ఓ ఛాలెంజ్ గురించి ‘మైత్రీ మవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన నవీన్ వెల్లడించారు. లాక్ డౌన్ టైంలో తమ చిత్రానికి ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరించామని.. ఇక ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ అనుకున్నాక తమకు ఒక పెద్ద ఆఫర్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఐతే చిరంజీవి ఒకటికి రెండుసార్లు తమకు ఫోన్ చేసి ‘ఉప్పెన’ క్లైమాక్స్ ఒక సంచలనం సృష్టించి సినిమా గొప్ప విజయం సాధించడానికి తోడ్పడుతుందని.. తనను నమ్మి ఈ సినిమాను ఎవరికీ అమ్మకుండా సొంతంగా రిలీజ్ చేయాలని చిరు చెప్పారని నవీన్ వెల్లడించారు.

ఒకవేళ ‘ఉప్పెన’ తాను చెప్పినట్లుగా ఆడకపోతే ఇక సినిమాలపై ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వనని, తన జడ్జిమెంట్ దెబ్బ తిందని భావించి ఊరుకుంటానని చిరు ఛాలెంజ్ చేసినట్లు నవీన్ వెల్లడించారు. ఆయన ఇచ్చిన భరోసాతోనే ‘ఉప్పెన’ను మెజారిటీ ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేశామని, ఇప్పుడు వచ్చిన ఫలితం చూసి తమకు చాలా ఆనందంగా ఉందని నవీన్ తెలిపారు.