మ‌హేష్ అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్


ఒక‌ప్ప‌టితో పోలిస్తే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బాగా వేగం పెంచాడు. ఆరేడు నెల‌ల‌కో సినిమా పూర్తి చేస్తూ ప్ర‌తి ఏడాదీ ఓ రిలీజ్ ఉండేలా చూసుకుంటున్నాడు కొన్నేళ్లుగా. కానీ క‌రోనా కార‌ణంగా ఈసారి మాత్రం అనుకోకుండా మ‌హేష్ కెరీర్లో రెండేళ్ల గ్యాప్ వ‌చ్చేసింది. గ‌త ఏడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ప‌ల‌క‌రించిన మ‌హేష్‌.. ఈ ఏడాది అభిమానుల‌కు కొత్త సినిమా కానుక ఇవ్వ‌లేక‌పోతున్నాడు.

ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో అత‌ను న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట చిత్రం అనౌన్స్ అయ్యాక సెట్స్ మీదికి వెళ్ల‌డంలో ఆల‌స్యం జ‌రిగింది. ముందు ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్దంలో రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ.. త‌ర్వాత అలాంటిదేమీ లేద‌ని తేలింది. 2022 సంక్రాంతికి ఈ చిత్రాన్ని షెడ్యూల్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్పుడిప్పుడే ఈ సినిమా నుంచి ఏ అప్‌డేట్లూ ఉండ‌వ‌ని మ‌హేష్ అభిమానులు ఫిక్స‌యిపోయారు.

కానీ ఊహించ‌ని విధంగా అభిమానుల‌కు చాలా ముందుగానే ఓ స‌ర్ప్రైజ్ ఇవ్వాల‌ని మ‌హేష్ అండ్ టీం ఫిక్స‌యిన‌ట్లు స‌మాచారం. స‌ర్కారు వారి పాట షూటింగ్ గ‌త నెల‌లోనే దుబాయ్‌లో మొద‌లైన సంగతి తెలిసిందే. 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్క‌డ చిత్రీక‌ర‌ణ ముగించుకున్నాక దుబాయ్ డైరీస్ పేరుతో ఓ స్పెష‌ల్ వీడియోను వ‌ద‌ల‌బోతోంద‌ట చిత్ర బృందం. షూటింగ్ లొకేష‌న్ల‌తో పాటు.. ఆన్ లొకేష‌న్ ముచ్చ‌ట్ల‌తో ఈ వీడియో రూపొందనుంద‌ట‌.

మ‌హేష్ లుక్‌ను లైట్‌గా ఇందులో రివీల్ చేస్తార‌ట‌. కాస్ట్ అండ్ క్రూను చూపిస్తూ.. సినిమాపై ఆస‌క్తిని పెంచేలా దీన్ని తీర్చిదిద్ద‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. మ‌హేష్ అభిమానుల‌కు ఇది సర్ప్రైజ్ లాగా ఉంటుంద‌ని.. ఫ‌స్ట్ లుక్ రిలీజ‌య్యే వ‌ర‌కు వాళ్ల‌ను ఎంగేజ్ చేస్తుంద‌ని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్ ఉమ్మ‌డిగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు.