థియేటర్లలో ఇప్పటికీ 50 శాతమే


ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందంటూ సినీ జనాలు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ వారం ‘జాంబి రెడ్డి’ సహా కొత్త సినిమాలు కొన్ని రిలీజవుతున్న నేపథ్యంలో టికెట్లు బుక్ చేద్దామని చూస్తున్న ప్రేక్షకులకు ‘బుక్ మై షో’ సహా టికెటింగ్ వెబ్ సైట్లలో ఆక్యుపెన్సీ 50 శాతమే చూపిస్తున్నాయి. సగం సీట్లను బ్లాక్ చేసి ఉంచారు. ఆల్టర్నేట్ సీట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి కేంద్రం ఆదేశాలు ఇంకా ఎందుకు అమలు కావట్లేదని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇంకా 50 పర్సంట్ ఆక్యుపెన్సీనే అమల్లో ఉంది. కేంద్రం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చినప్పటికీ.. రాష్ట్రాలు ఇందుకు అనుగుణంగా జీవోలు పాస్ చేయకపోవడమే ఇందుక్కారణం.


తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ రూల్‌నే కొనసాగిస్తున్నారు. దక్షిణాదిన ఒక్క తమిళనాడు మాత్రమే 100 శాతం ఆక్యుపెన్సీకి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేసింది. నార్త్‌లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించాయి. మిగతా రాష్ట్రాలన్నింట్లోనూ 50 శాతంతోనే థియేటర్లు నడుస్తున్నాయి.

కర్ణాటకలో ఈ నెల చివరి వరకు 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడపాలని ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్‌లో ఈ నెల 8 వరకు 50 శాతం కొనసాగేలా మార్గదర్శకాలు ఇచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు జారీ చేయడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఐతే ఈ శుక్రవారం లోపు ఆదేశాలు వస్తే ‘జాంబి రెడ్డి’ లాంటి కొత్త సినిమాలకు కలిసొస్తుంది. థియేటర్లపై మెయింటైనెన్స్ భారం తగ్గుతుంది.