టాలీవుడ్‌పై కన్నడ హీరో ఆగ్రహం


కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు కోపం వచ్చింది. ఆ కోపం తెలుగు సినీ పరిశ్రమ మీద కావడం గమనార్హం. తన కొత్త సినిమా ‘రాబర్ట్’ను తెలుగులో రిలీజ్ చేయడానికి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సహకరించడం లేదన్నది అతడి ఆరోపణ. కన్నడలో పెద్ద మాస్ హీరోల్లో ఒకడైన దర్శన్ ప్రధాన పాత్రలో ‘రాబర్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.

ఇంతకుముందైతే కన్నడ సినిమాలు కర్ణాటక దాటితే ఏదో నామమాత్రంగానే విడుదలయ్యేవి. కానీ ‘కేజీఎఫ్’ తర్వాత అక్కడి హీరోలందరికీ కన్నడ రాష్ట్రం అవతల మార్కెట్ పెంచుకోవాలన్న ఆశ పుట్టింది. ఈ క్రమంలోనే దర్శన్ కూడా ‘రాబర్ట్’ను తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నాడు. దీని గురించి అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. తెలుగు పోస్టర్ కూడా వదిలారు.

కానీ మార్చి 11న తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాయి. శర్వానంద్ మూవీ ‘శ్రీకారం’తో పాటు మంచు విష్ణు చిత్రం ‘మోసగాళ్లు’, శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్‌ల ‘గాలి సంపత్’, నవీన్ పొలిశెట్టి-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణల ‘జాతి రత్నాలు’ కూడా అదే రోజున విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మన సినిమాలకే అప్పుడు థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టం. అలాంటిది ఇక్కడ ఏమాత్రం గుర్తింపు, మార్కెట్ లేని దర్శన్ సినిమా కోసం ఎక్కడ థియేటర్లు కేటాయిస్తారు? అతడి కోసం ఎవరు పోరాడతారు? ఐతే తన సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సహకరించడం లేదంటూ దర్శన్ కన్నడ ఫిలించాంబర్‌ను ఆశ్రయించాడు.

కర్ణాటకలో తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలు పెద్ద ఎత్తున రిలీజవుతాయని, దీని వల్ల మన సినిమాలు చచ్చిపోతున్నాయని.. మన సినిమాలను వేరే భాషల్లో విడుల చేయడానికి సహకారం అందనపుడు ఇతర భాషా చిత్రాలకు మనం ఇంత ప్రాధాన్యం ఎందుకివ్వాలని అతను ప్రశ్నించాడు. ఐతే తెలుగు సినిమాలను కన్నడిగులు, అక్కడుండే తెలుగువాళ్లు ఎగబడి చూస్తారు. కన్నడ సినిమాల పట్ల మనవాళ్లకు ఆసక్తి ఉండదు. ఏదైనా డిమాండ్-సప్లై ఆధారంగానే ఉంటుంది. ఎవరి ఆసక్తి వాళ్లది. అది గుర్తించకుండా తెలుగు సినిమాల మీద పడి ఏడిస్తే ఏం లాభం?