హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల మార్క్ దాటడంతో తెలుగులో కూడా ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్ 18న త్రివిక్రమ్ సమర్పణలో తెలుగు వెర్షన్ వస్తోంది. దీంతో అసలు నీమ్ కరోలీ బాబా ఎవరు, ఆయన కథలో ఏముంది అన్నది చాలామందికి ఆసక్తిగా మారింది.

నీమ్ కరోలీ బాబా అసలు పేరు లక్ష్మీ నారాయణ శర్మ. ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన ఆయన చిన్న వయసులోనే సన్యాస జీవితం వైపు వెళ్లారు. హనుమంతుడిపై గాఢమైన భక్తి ఉండేది. ప్రేమ, సేవ, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం లాంటి విషయాలనే ఎక్కువగా చెప్పేవారు. ఉత్తరాఖండ్‌లోని కైంచీ ధామ్ ఆయన ఆశ్రమం.

హనుమాన్ అంశ్ మాత్రం రెగ్యులర్ బయోపిక్‌లా ఆయన జీవితాన్ని మొత్తం చూపించదు. తల్లిని కోల్పోయిన ఒక బాలుడు దేవుడిని వెతుక్కుంటూ బయలుదేరడం నుంచి కథ మొదలవుతుంది. ఆ ప్రయాణంలో భక్తి, సేవ, త్యాగం ద్వారా అతను నీమ్ కరోలీ బాబాగా ఎలా మారాడన్నది చూపించారు. హనుమంతుడిపై భక్తి, ప్రజలకు సేవ చేయడం, భక్తులు చెప్పుకునే కొన్ని లీలలను కూడా కథలో ఉపయోగించారు.

బాబా పేరు విదేశాల్లో ఎక్కువగా వినిపించడానికి స్టీవ్ జాబ్స్, రామ్ దాస్ లాంటి వాళ్లు కూడా కారణమయ్యారు. 1974లో భారత్‌కు వచ్చిన స్టీవ్ జాబ్స్ ఆయనను కలవాలని కైంచీ ధామ్‌కు వెళ్లాడు. కానీ అప్పటికే బాబా మరణించారు. తర్వాత ఫేస్‌బుక్ కష్టాల్లో ఉన్న సమయంలో మార్క్ జుకర్‌బర్గ్‌ను కూడా అదే ఆశ్రమానికి వెళ్లమని జాబ్స్ సూచించినట్లు జుకర్‌బర్గ్ స్వయంగా చెప్పాడు.

హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కూడా నీమ్ కరోలీ బాబా ఫొటో చూసి ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిందని గతంలో చెప్పింది. అయితే హనుమాన్ అంశ్ మొదటి భాగం సెలబ్రిటీ కనెక్షన్స్‌పై ఎక్కువగా వెళ్లదు. బాబా ఆధ్యాత్మిక ప్రయాణం, హనుమంతుడిపై భక్తి, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలే ఉంటాయి. ఇప్పుడు హిందీలో భారీ రన్ చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి మన ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.