అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్ గా గీత గోవిందం ఒక స్పెషల్ మూవీగా అభిమానులకు గుర్తుండి పోతుంది. అప్పటిదాకా మీడియం బడ్జెట్ సినిమాలతో లాక్కొస్తున్న దర్శకుడు పరశురామ్ పేట్లని ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లింది. ఏకంగా మహేష్ బాబు సర్కారు వారి పాటని తెచ్చి పెట్టింది. అంచనాలు పూర్తిగా అందుకోలేదు కానీ లేదంటే పరశురామ్ గ్రాఫ్ ఇంకోలా ఉండేది.
తర్వాత విజయ్ దేవరకొండతోనే మరోసారి చేతులు కలిపి తీసిన ది ఫ్యామిలీ స్టార్ దారుణంగా పోవడం పెద్ద కుదుపనే చెప్పాలి. నిర్మాత దిల్ రాజు పెట్టుకున్న నమ్మకం నిలబడలేదు. దీంతో పాటు నాగచైతన్య కాంబోని చేతులారా వదిలేసుకోవడం పరశురామ్ మిస్ చేసుకున్న ఇంకో జాక్ పాట్. ఇదంతా రెండేళ్ల వెనుకటి ముచ్చట. తర్వాత ఒక బాలీవుడ్ స్టార్ కోసం ట్రై చేసిన పరుశురాం ఫైనల్ నెరేషన్ లో మెప్పించలేకపోయారని ముంబై మీడియా టాక్.
ఇక అసలు విషయానికి వస్తే ఎట్టకేలకు పరుశురాంకు ఒక భారీ ఆఫర్ అయితే వచ్చింది. తేజ సజ్జ హనుమాన్ తీసిన నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ తో సంబరాల ఏటిగట్టుని ప్యాన్ ఇండియా స్థాయిలో తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లోనే పరశురామ్ కు ఒక ప్రాజెక్టు ఓకే అయ్యిందట. హీరో, ఇతర వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు కానీ ఇంకొన్ని వారాల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు.
జయాపజయాలు పక్కనపెడితే ఇప్పటి దర్శకులు ప్రతి సినిమాకు రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకోవడం పరిపాటిగా మారింది. సందీప్ వంగ లాంటి స్టార్ డైరెక్టర్ తో మొదలుపెట్టి తరుణ్ భాస్కర్ లాంటి క్రేజీ దర్శకుడి దాకా అందరిదీ ఇదే తంతు. కథలు సిద్ధంగా లేకపోవడం దగ్గరి నుంచి హీరోలను మెప్పించడంలో విఫలం కావడం దాకా దీనికి ఎన్నో కారణాలున్నాయి. పరశురామ్ సైతం ఇదే కోవలో ఉన్నారు. ఎవరితో సెట్ అయినా వీలైనంత వేగంగా తీస్తే అదే పదివేలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates