అప్పుడు బన్నీతో… ఇప్పుడు బాలయ్యతో?

తెలుగు సినిమాల్లోకి పరభాషా నటులను క్యారెక్టర్, విలన్ పాత్రల్లోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే. సొంత భాషల్లో పెద్దగా గుర్తింపు లేని వాళ్లు కూడా తెలుగు చిత్రాలతో మంచి పేరు సంపాదించి గొప్ప స్థాయిని అందుకున్నారు. ఇతర భాషల్లో హీరో పాత్రలు చేస్తున్న వాళ్లు కూడా తెలుగులో విలన్ పాత్రలు చేయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఆ క్యారెక్టర్ క్లిక్ అయిందంటే ఇక్కడ బిజీ నటులు అయిపోతుంటారు.

తమిళంలో హీరోగా మంచి పేరు ఉన్న ఆర్య.. తెలుగులో చాలా ఏళ్ల కిందటే విలన్ పాత్ర చేయడం గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్, గుణశేఖర్‌ల మూవీ ‘వరుడు’లో అతను ప్రతినాయక పాత్ర పోషించాడు. అతను తన క్యారెక్టర్‌కు బాగానే న్యాయం చేసినా.. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఆర్య మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఐతే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ అతను తెలుగులో ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో ఆర్య నటించనున్నాడట. అతడి కోసం నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రను డిజైన్ చేశాడట కొరటాల. ఆర్య ఒప్పుకుంటే ఈ సినిమాకు ఆకర్షణగా మారతాడనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కూడా ప్రతినాయక ఛాయలున్న ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య బేసిగ్గా తెలుగమ్మాయే అయినా.. ఆమె కథానాయికగా తమిళంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించింది. ఇలా ఇద్దరు తమిళ ఆర్టిస్టులతో ముఖ్య పాత్రలు చేయించాలనుకోవడం విశేషమే.

ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ సినిమాను నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి.. కొరటాల మిత్రుడు, దేవర నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ మూవీ బడ్జెట్ రూ.150 కోట్ల పైమాటే అని మొదలైనపుడే వార్తలు వచ్చాయి. బాలయ్య మీద ఈ బడ్జెట్ రిస్క్ అని, అందుకే ఈ చిత్రాన్ని ఆపేస్తున్నారని ఈ మధ్య ప్రచారం జరిగింది కానీ.. అందులో నిజం లేదని తేలింది. భుజం గాయానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న బాలయ్య.. వచ్చే నెలలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు.