మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది హీరోయిన్లు తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించినవాళ్లే. గత కొన్నేళ్లలో ఓటీటీల ద్వారా మలయాళ చిత్రాలకు మన ప్రేక్షకులు బాగా అలవాటు పడడంతో అక్కడి నుంచి యంగ్ హీరోయిన్లకు మన దగ్గర డిమాండ్ బాగా పెరిగింది. సాయిపల్లవి సైతం మలయాళ సినిమా ‘ప్రేమమ్’తో ఫేమ్ తెచ్చుకుని తెలుగులో బిజీ అయిన అమ్మాయే.
ఈ మధ్య మమిత బైజు, అనస్వర రాజన్ లాంటి యంగ్ హీరోయిన్లకు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. మలయాళంలో తీసుకునే దాంతో పోలిస్తే ఇక్కడ మూణ్నాలుగు రెట్లు పారితోషకం తీసుకునే రేంజిలో ఉన్నారు ఈ ఇద్దరు. అనస్వర తెలుగులో ఇప్పటిదాకా చేసింది ఒక్క సినిమా (ఛాంపియన్) మాత్రమే. అది కూడా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. అయినా ఆమెకు తెలుగులో డిమాండ్ మామూలుగా లేదని అర్థమవుతోంది.
ఆల్రెడీ తెలుగులో ‘ఇట్లు అర్జున’ అనే సినిమాలో కథానాయికగా నటిస్తున్న అనస్వర.. సంతోష్ శోభన్ సరసన ‘అంతా రాములోరు చూసుకుంటారు’ అనే సినిమా కూడా చేస్తున్న విషయం ఇప్పుడే వెల్లడైంది. ఈ సినిమాకు అనస్వరను అతి కష్టం మీద నటింపజేసినట్లు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని తెలిపాడు. ఈ సినిమా కథ చెప్పగానే అనస్వరకు నచ్చిందని, కానీ తన డేట్లు ఖాళీ లేవని చెప్పేసిందని ధరీజ్ తెలిపాడు.
కానీ ఆ పాత్రలో ఇంకొకరిని తాను ఊహించుకోలేకపోయానని.. ఆమెనే ఈ క్యారెక్టర్ చేయాలని ఆరు నెలల పాటు తన వెంటపడ్డానని.. చివరికి అనస్వర ఈ సినిమాను ఓకే చేసిందని ధీరజ్ చెప్పాడు. ఇక సినిమాలో ఆమె హావభావాలు అద్భుతమని.. తన పాత్రలో చించిపడేసిందని అనస్వరను కొనియాడాడు ధీరజ్. ఇలాంటి పేరున్న నిర్మాత ఆరు నెలల పాటు తన వెంట పడే పరిస్థితి వచ్చిందంటే.. అనస్వరకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె తెలుగులో మరే క్రేజీ ప్రాజెక్టులోనూ నటించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates