ప్రేమ హద్దులు చెరిపేసే ‘ఎపిక్’ స్టోరీ

బేబీ బ్లాక్ బస్టర్ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ వచ్చే వారం సెప్టెంబర్ 11 విడుదలకు రెడీ అయిపోయింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ రామ్ కామ్ కు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే పలు వాయిదాల వల్ల లేట్ అయిన ఎపిక్ ద్వారా ఆదిత్య హాసన్ బిగ్ స్క్రీన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ రూపంలో తొలి అడుగుతోనే హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే.

ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది. కథేంటో దాచకుండా ఓపెన్ చేశారు. మధ్యతరగతికి చెందిన ఆనంద్(ఆనంద్ దేవరకొండ)కు జీవితంలో దర్శకుడు కావాలనే లక్ష్యం ఉంటుంది. అయితే ఇంట్లో పరిస్థితులు సహకరించవు. దీంతో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్తాడు. అక్కడ పరిచయమైన ఓ అమ్మాయి (వైష్ణవి చైతన్య) తక్కువ సమయంలోనే ప్రేమ నుంచి శారీరకంగా ఒక్కటయ్యేంత దగ్గరవుతుంది. ఆ తర్వాత అనూహ్యమైన పరిస్థితులు తలెత్తుతాయి. అదేంటో తెరమీద చూడాలి.

యూత్ ని టార్గెట్ చేసిన ఎపిక్ లో టేకింగ్ ఫ్రెష్ గా అనిపిస్తోంది. ఫిల్టర్స్ లేకుండా ఒక జెన్ జీ అమ్మాయి, అబ్బాయి మధ్య ఎలాంటి సంభాషణలు ఉంటాయో చాలా రియలిస్టిక్ గా రాసుకున్నారు ఆదిత్య హాసన్. పీరియడ్స్ గురించి నేరుగా ఒక డైలాగు పెట్టడం దానికో చిన్న ఉదాహరణ. జంట కూడా కొత్తగా ఉంది. హేశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, లండన్ నిర్మాణ విలువలు మంచి క్వాలిటీ తీసుకొచ్చాయి. టార్గెట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది.

కాకపోతే కుటుంబ ప్రేక్షకులు ఇంత ఓపెన్ లవ్ స్టోరీని ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. యువత వేగంగా అనుసంధానం అవుతారు. మూడేళ్ళ గ్యాప్ లో ఉన్న ఆనంద్ దేవరకొండతో పాటు రెండు డిజాస్టర్లు చూసిన వైష్ణవి చైతన్యకు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా కీలకం. కార్తీ సర్దార్ 2, సుమంత్ మహేంద్రగిరి వారాహి రూపంలో పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా టీమ్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. ఇవాళ జరిగిన వేడుకకు ఆనంద్ వదిన రష్మిక మందన్న గెస్టుగా రావడం విశేషం.