సూపర్ స్టార్ మహేష్ బాబు మొదట్నుంచి టాలీవుడ్కే పరిమితం అయిపోయాడు కానీ.. తనకు ఇతర భాషల్లోనూ మంచి డిమాండే ఉంది. తన కోసం కథలు తయారు చేసే దర్శకులు వేరే ఇండస్ట్రీల్లోనూ చాలామందే ఉన్నారు. బాలీవుడ్ నుంచే ఆయనకు ఆయనకు అనేక ఆఫర్లు వచ్చినా పట్టించుకోలేదు.
కోలీవుడ్లోనూ మణిరత్నం, గౌతమ్ వాసుదేవ్ మేనన్ లాంటి లెజెండరీ డైరెక్టర్లు మహేష్తో సినిమా చేయడానికి ప్రయత్నించారు కానీ.. కుదరలేదు. ఈ జాబితాలో తెలుగు అమ్మాయే అయిన తమిళ దర్శకురాలు సుధ కొంగర కూడా ఉందట. ఆమె కూడా మహేష్ బాబుకు ఒక కథ చెప్పిందట. కానీ ఏవో కారణాలతో ఆ సినిమా ముందుకు కదల్లేదని సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇటీవలే విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి చిత్రాలతో తెలుగులో పెద్ద హిట్లు కొట్టిన జి.వి.ప్రకాష్.. త్వరలోనే మండాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో తమిళ అగ్ర కథానాయకుడు విజయ్తో ఎక్కువ సినిమాలు చేయకపోవడం, రెండు చిత్రాలకే పరిమితం కావడం మీద అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెబుతూ.. మహేష్, సుధ కాంబో గురించి మాట్లాడాడు.
విజయ్తో సినిమా చేయడానికి వెట్రిమారన్తో పాటు సుధ కొంగర ఇద్దరూ ప్రయత్నించారని.. కానీ విజయ్ వెంటనే సినిమాలు చేయాల్సి ఉండగా, ఆ ఇద్దరు దర్శకులూ స్క్రిప్టు కోసం టైం అడిగారని.. దీంతో విజయ్ తన కాల్ షీట్లను బీస్ట్ మూవీకి ఇచ్చేశాడని.. ఈ రెండు చిత్రాలు మెటీరియలైజ్ అయి ఉంటే.. తానే సంగీతం అందించేవాడినని చెప్పాడు.
విజయ్ కోసం సుధ అనుకున్నది సూపర్ స్క్రిప్టు అని.. తర్వాత అదే కథను మహేష్ బాబుకు కూడా సుధ చెప్పిందని.. కానీ ఏవో కారణాలతో ఆయనతో కూడా సినిమా ముందుకు కదల్లేదని ప్రకాష్ తెలిపాడు. సుధ భవిష్యత్తులో కచ్చితంగా ఈ కథతో సినిమా చేస్తుందని, ఆ ప్రాజెక్టుకు తానే సంగీతం అందిస్తానని జి.వి. తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates