చిరు అతడితో సినిమా చేసి ఉంటే..

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కొంచెం భిన్నమైన సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’లో ఆయన పూర్తిగా హీరోయిజాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు బాబి కొల్లి దర్శకత్వంలో చేస్తున్న ‘కాకా’ కూడా కొంచె ం భిన్నమైన సినిమాలాగే కనిపిస్తోంది.

మరోవైపు ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరు చేసే సినిమా కచ్చితంగా పాత్ బ్రేకింగ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఐతే దీంతో పాటుగా చిరు ఇంకో న్యూ ఏజ్ దర్శకుడితో పని చేయాల్సిందట. ఆ దర్శకుడే.. పి.ఎస్.మిత్రన్. ఈ తమిళ యంగ్ డైరెక్టర్ చిరుకు కథ చెప్పి ఆయన్ని ఇంప్రెస్ చేశాడట. కానీ టైమ్ లైన్ కుదరక చిరు ఈ సినిమా చేయలేకపోయారని మిత్రన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ప్రస్తుతం బాబి డైరెక్ట్ చేస్తున్న సినిమా కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థలోనే చిరు హీరోగా సినిమా చేయడానికి తాను ప్రయత్నించినట్లు మిత్రన్ వెల్లడించాడు. తాను చెప్పిన కథ చిరును బాగా ఎగ్జైట్ చేసిందని.. ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని.. ఐతే ‘విశ్వంభర’ తర్వాత ఈ సినిమా చేస్తానన్నారని.. కానీ ఆ సినిమా ఆలస్యం కావడంతో టైమింగ్ దెబ్బ తిందని.. తనకు వేరే కమిట్మెంట్ ఉండడంతో అటు మళ్లానని మిత్రన్ వెల్లడించాడు.

మిత్రన్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే.. ‘విశ్వంభర’ ఆలస్యం కాకపోతే చిరు.. కేవీఎన్ సంస్థలో మిత్రన్‌తోనే సినిమా చేసేవాడన్నమాట. బాబీతో సినిమా ఉన్నా అది తర్వాత ఎప్పుడో ఇంకో ప్రొడక్షన్‌ హౌస్‌లో తెరకెక్కేదేమో. మిత్రన్‌తో చిరు సినిమా చేసి ఉంటే అది చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్టు అయ్యేదనడంలో సందేహం లేదు. తన తొలి చిత్రం ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు)తో అతను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అతను ఒకప్పటి శంకర్‌ను గుర్తు చేశాడు. రెండో సినిమా ‘శక్తి’ కూడా మంచి ప్రయత్నమే. మూడో సినిమా ‘సర్దార్’తో మళ్లీ పెద్ద హిట్ కొట్టిన అతను.. ఇప్పుడు ‘సర్దార్-2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.