నాకు, సునీల్‌కు తాంత్రిక విద్య తెలుసు-త్రివిక్రమ్

కమెడియన్ సునీల్‌కు అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఎంతటి ఆప్తమిత్రుడో అందరికీ తెలిసిందే. ఇద్దరూ భీమవరం నుంచి ఒకేసారి హైదరాబాద్‌కు వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన వాళ్లే. ముందు త్రివిక్రమ్ రచయితగా నిలదొక్కుకోగా.. అతడి ద్వారా కమెడియన్‌గా అవకాశాలు సంపాదించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు సునీల్. ఆ తర్వాత రచయితగా త్రివిక్రమ్, కమెడియన్‌గా సునీల్ తిరుగులేని స్థాయిని అందుకున్నారు. ఆ తర్వాత కథంతా తెలిసిందే.

ఐతే ఏ స్థాయికి చేరుకున్నప్పటికీ వీళ్లిద్దరూ తమ పాత రోజులను మరిచిపోరు. పంజాగుట్టలో తాము ఉంటున్న గది, అందులో గడిపిన రోజుల గురించి మాట్లాడుతూనే ఉంటారు. తమ ఇద్దరికీ లైఫ్ ఇచ్చిన ఆ గదికి ఇప్పటికీ వీళ్లిద్దరూ రెంట్ కడుతుండటం విశేషం. అప్పుడప్పుడూ వెళ్లి ఆ గదిలో గడిపి కూడా వస్తుంటారు.

కాగా తాజాగా ‘అల వైకుంఠపురములో’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం రీయూనియన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో త్రివిక్రమ్.. సునీల్ గురించి మాట్లాడుతూ పాత రోజుల్లోకి వెళ్లిపోయాడు. పంజాగుట్ట రూంలో ఉన్నపుడు తమ ఇద్దరికీ తాంత్రిక విద్యలు తెలుసని.. వాటిని ఒకరి మీద ఒకరు ప్రయోగించేవాళ్లమని అన్నాడు త్రివిక్రమ్. వీళ్లిద్దరిలో ఈ కొత్త కోణం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతుంటే అసలు విషయం చెప్పాడు త్రివిక్రమ్.

తనకు చలేస్తే ఆటోమేటిగ్గా ఫ్యాన్ ఆగిపోయేదని ముందు చెప్పిన త్రివిక్రమ్.. తన మనసు అర్థం చేసుకుని సునీల్ వెళ్లి ఫ్యాన్ ఆపి వచ్చేవాడని తెలిపాడు. అలాగే సునీల్‌కు దాహం వేస్తే వెళ్లి నీళ్లు తాగేవాడు కాదని.. అతడి పరిస్థితి అర్థం చేసుకుని తాను నీళ్లు తెచ్చి ఇచ్చేవాడని.. ఇలా ఒకరితో ఒకరు శాడిస్టిగ్గా ప్రవర్తించేవాళ్లమని త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. ఆ రోజుల్ని దృష్టిలో ఉంచుకునే ‘అల వైకుంఠపురములో’లో సునీల్ ఉండాల్సిందే అని పట్టుబట్టి.. అతడికి ఇందులో పాత్ర ఇచ్చానని.. అతను ఊరికే అలా ఉంటే చాలు, మ్యాజిక్ జరుగుతుందని అనుకున్నానని.. తాను కోరుకున్నట్లే వింటేజ్ సునీల్ ఇందులో కనిపించాడని, సినిమా అద్భుత విజయం సాధించిందని త్రివిక్రమ్ చెప్పాడు.