ఇటీవలే జీ ఫైవ్ లో నేరుగా విడుదలైన సట్లెజ్ సినిమా రెండు రోజుల తర్వాత తీసేయాల్సి రావడం మీద మీడియా, ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. థియేటర్ రిలీజ్ కోసం మూడేళ్లు పోరాటం చేసి చివరికి వేరే ఆప్షన్ లేక OTT బాట పట్టిన నిర్మాతలు అక్కడ కూడా అడ్డంకి ఎదురు కావడంతో తీవ్రంగా నిరాశ చెందారు. ఐటి యాక్ట్ 2021 ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వర్గాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ పరిణామం కొత్త మార్పును తీసుకొచ్చేలా ఉంది. త్వరలోనే ఓటిటి కంటెంట్ కు కూడా సెన్సార్ తీసుకురావాలనే ప్రతిపాదన బీజీపీ సర్కార్ వద్ద తీవ్ర పరిశీలనలో ఉందట. సెన్సార్ బోర్డు పరిధిలోకి తేవడం కన్నా దీనికి విడిగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని వెనుక ఉన్న సాధ్యాసాధ్యాలు, చట్ట రూపకల్పనకు ఉన్న అవకాశాలన్నీ కూలంకుషంగా చర్చిస్తున్నారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన సమాచార శాఖ నుంచి రావొచ్చు.
ఒకవేళ ఇది నిజంగా కార్యరూపం దాలిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఓటిటి వెబ్ సిరీస్, సినిమాల్లో విచ్చలవిడితనం, హింస హద్దులు దాటుతోంది. వీటిని స్ఫూర్తిగా తీసుకుని హత్యలు చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చాలా వాటిలో మర్డర్స్ ఎలా చేయాలి, పోలీసుల విచారణ ఎలా జరుగుతుంది లాంటి విషయాలను డీటెయిల్డ్ గా చూపిస్తున్నారు. చివర్లో హంతకులు పట్టుబడినట్టు చూపించినా పెద్దగా ప్రయోజనం ఉన్నట్టు కనిపించడం లేదు.
కాకపోతే ఇది ప్రభుత్వానికి సవాలే. ఎందుకంటే సినిమాలంటే వారానికి పది ఇరవై వస్తాయి అనుకున్నా ఓటిటిలో విపరీతమైన కంటెంట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్, జీ 5, ఆహా లాంటి ప్రముఖ ప్లాట్ ఫార్మ్స్ తో పాటు లెక్కలేనన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ సెన్సార్ తలుపులు తడితే సర్టిఫికెట్ ఇవ్వడానికి రోజులు కాదు నెలలు పట్టొచ్చు. ముఖ్యంగా వెబ్ సిరీస్ నిడివిని దృష్టిలో పెట్టుకుంటే. చూడాలి మరి ఎలా దీన్ని అమలు చేయబోతున్నారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates