క్రాక్ రీమేకా.. రవితేజ క్లారిటీ

కొత్త ఏడాదిలో టాలీవుడ్ తొలి సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఇంకో మూడు రోజుల్లోనే మాస్ రాజా రవితేజ సినిమా ‘క్రాక్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో సోలో రిలీజ్ అడ్వాంటేజ్ కోసం పండక్కి ఐదు రోజుల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఐతే విడుదల దగ్గర పడ్డాక కూడా ‘క్రాక్’ విషయంలో ఒక సస్పెన్స్ కొనసాగుతోంది.

ఈ చిత్రం తమిళ హిట్ మూవీ ‘సేతుపతి’కి రీమేక్ అనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. టీజర్ రిలీజ్ చేసినపుడు అందరిలోనూ అవే సందేహాలు కలిగాయి. ఆల్రెడీ ‘జయదేవ్’ పేరుతో రీమేక్ అయిన సినిమాకు మళ్లీ రీమేక్ ఏంటి అనే డౌట్ అందరినీ వెంటాడుతోంది. కానీ ఇటీవల రిలీజైన ట్రైలర్ చూస్తే మాత్రం ‘సేతుపతి’తో పోలిస్తే భిన్నంగా కనిపించింది. కానీ కొన్ని షాట్లు మాత్రం ఆ సినిమాను గుర్తుకు తెచ్చాయి.

ఐతే ‘క్రాక్’ రీమేకా కాదా అనే విషయంలో హీరో రవితేజ స్వయంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కొన్ని తెలుగు రాష్ట్రంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని.. ‘క్రాక్’ ఏ చిత్రానికీ రీమేక్ కాదని రవితేజ స్పష్టం చేశాడు. ఐతే ‘సేతుపతి’ నుంచి హీరో, విలన్ పాత్రలతో పాటు కొన్ని సన్నివేశాలు కూడా తీసుకుని.. వేరే అంశాలు, పాత్రలు కథను ఇంకో రకంగా అల్లుకుని ‘క్రాక్’ సినిమాను తీర్చిదిద్ది ఉండొచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఏదేమైనా ఈ సస్పెన్సుకు ఇంకో మూడు రోజుల్లో తెరపడబోతోంది. రవితేజతో ఇంతకుముందు డాన్ శీను, బలుపు లాంటి హిట్ సినిమాలు అందించిన గోపీచంద్ మలినేని ‘క్రాక్’కు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ దర్శకుడితో తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రవితేజ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా లాంటి డిజాస్టర్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై రవితేజ చాలా ఆశలే పెట్టుకున్నాడు.