బాహుబలి పోయింది అనుకుని…

తెలుగు సినిమానే కాదు, మొత్తంగా ఇండియన్ సినిమా రూపు రేఖలను మార్చేసిన సినిమా.. బాహుబలి. ఒక సౌత్ ఇండియన్ రీజనల్ మూవీలో అలాంటి భారీతనం, కళ్లు చెదిరే విజువల్స్ ఏమాత్రం ఊహించలేనివి. ఆ చిత్రానికి దేశవ్యాప్తంగా దక్కిన ఆదరణ, వసూళ్లు ఒక చరిత్రగా మారింది. ఐతే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు ముందు రోజు రాత్రి వేసిన పెయిడ్ ప్రిమియర్స్ నుంచి డివైడ్ టాక్ రావడం తెలిసిందే.

దీని గురించి రాజమౌళి గతంలోనే మాట్లాడాడు. తమ టీం అంతా ఎంత టెన్షన్ పడిందీ వివరించాడు. తాజాగా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీలో రమ రాజమౌళి అప్పుడు తాము ఎదుర్కొన్న ఒత్తిడి గురించి వివరించారు. ఈ సినిమా నష్టాల భర్తీకి మణికొండలో ఉన్న తమ ఫ్లాట్ ఒకటి అమ్మేయాలని అనుకున్నట్లు ఆమె వెల్లడించారు.

‘బాహుబలి: ది బిగినింగ్’కు వచ్చింది జస్ట్ మిక్స్డ్ టాక్ కాదని.. పూర్తిగా నెగెటివ్ ఫీడ్ బ్యాకే వచ్చిందని ఆమె తెలిపారు. అంతకుముందు రాజమౌళి చేసిన కొన్ని సినిమాలకు ముందు మిక్స్డ్ టాక్ వచ్చి తర్వాత సూపర్ హిట్ అయ్యాయని.. కానీ ‘బాహుబలి’కి అలా కాకుండా పూర్తిగా నెగెటివ్ టాకే రావడం తాము చాలా కంగారు పడ్డామని రమ చెప్పారు.

ఆ టాక్‌కు తగ్గట్లే సినిమా డిజాస్టర్ అయితే ఏం చేయాలని తాము అప్పుడు ఆలోచించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. నిర్మాతలు సినిమా మీద భారీ పెట్టుబడి పెట్టేశారని.. వాళ్లను ఆదుకోవడానికి మనం ఏం చేయగలమా అని ఆలోచిస్తే.. మణికొండలో తమకు ఉన్న ఒక చిన్న ఫ్లాట్ అమ్మేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఆ ఫ్లాట్ అమ్మడం వల్లేమీ నిర్మాతలు బయటపడిపోరని.. కానీ తమ వంతుగా ఏం చేయగలమా అని ఆలోచిస్తే అదొక్క మార్గమే కనిపించిందని రమ తెలిపారు. ‘బాహుబలి’కి నెగెటివ్ టాక్ రావడం గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన సాయి కొర్రపాటికి సినిమా దారుణం అంటూ వరుసగా మెసేజ్‌లు వచ్చాయని.. కానీ మొత్తం ఫీడ్ బ్యాక్‌ను ఆయన తమతో పంచుకోలేదని.. కానీ టాక్ చూస్తే సినిమా ఫ్లాప్ అవుతుందనిపించిందని..

దీంతో సినిమాను నిలబెట్టడానికి ఏం చేయాలి.. సెకండ్ పార్ట్ ఏమైనా తక్కువ బడ్జెట్లో తీసి నిర్మాతలను ఆదుకోగలమా అని ఆలోచించి దాని మీద చర్చలు జరిపినట్లు తెలిపారు. ఐతే డివైడ్ టాక్ తొలి రోజు షోలు అయ్యేసరికి బ్లాక్ బస్టర్ టాక్‌గా మారి ‘బాహుబలి’ చరిత్రాత్మక విజయం సాధించడంతో రాజమౌళి అండ్ టీం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.