వారణాసి సెట్… 7 గంటలకు షూటింగ్ అంటే

కెరీర్లో ఒక ద‌శ వ‌ర‌కు మామూలు మాస్ మ‌సాలా సినిమాలే తీశాడు రాజ‌మౌళి. మ‌గ‌ధీర నుంచి ఆయ‌నలోని మ‌రో కోణం బ‌య‌టికి వ‌చ్చింది. అప్ప‌టిదాకా తెలుగు సినిమా స్క్రీన్ మీద చూడ‌ని భారీత‌నం, అద్భుత క‌థాక‌థ‌నాల‌తో మ‌న ప్రేక్ష‌కుల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేశాడు. ఇక బాహుబ‌లితో ఆయ‌న సృష్టించిన అద్భుతాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆ సినిమా నుంచే రాజమౌళి గొప్ప‌ద‌నాన్ని దేశం మొత్తం గుర్తించడం మొద‌లుపెట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజ‌మౌళి ప్ర‌తిభేంటో జేమ్స్ కామెరూన్ స‌హా హాలీవుడ్ లెజెండ‌రీ ఫిలిం మేక‌ర్స్‌కు సైతం తెలిసింది.

ప్ర‌స్తుతం వార‌ణాసి మూవీని గ్లోబ‌ల్ స్థాయిలో గొప్ప‌గా నిల‌బెట్టే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు రాజ‌మౌళి. త‌న సినిమాల మేకింగ్‌లో రాజ‌మౌళి ఎంత క‌ష్ట‌ప‌డ‌తారో, ఆయ‌న క‌మిట్మెంట్ ఎలాంటిదో తెలిసిందే. ఆ విష‌య‌మై ఇప్పుడు వార‌ణాసి విల‌న్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు.

సెట్లో రాజ‌మౌళి అంత క‌ష్ట‌ప‌డే ఫిలిం మేక‌ర్‌ను తాను ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌ని పృథ్వీరాజ్ చెప్పాడు. వార‌ణాసి షూటింగ్‌లో భాగంగా 7 గంట‌ల‌కు ఆర్టిస్టుల‌ను సెట్‌కు ర‌మ్మ‌ని ఆయ‌న చెబుతార‌ని.. తాను, మ‌హేష్‌, ప్రియాంక ఆ టైంకి అక్క‌డికి వెళ్తే మొత్తం షూట్ సెట‌ప్ రెడీగా ఉంటుంద‌ని.. అప్ప‌టికే ఆయ‌న త‌న టీం అంద‌రితో ప‌ది ప‌న్నెండుసార్లు రిహార్స‌ల్స్ చేసి ఉంటార‌ని.. మ‌రి ఆయ‌న ఎప్పుడు వ‌చ్చి ఇదంతా చేశాడా అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంద‌ని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించాడు.

30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఇప్పుడే తొలి సినిమా తీస్తున్న కొత్త ద‌ర్శ‌కుడిలా త‌ప‌న ప‌డ‌తారు, క‌ష్ట‌ప‌డ‌తార‌ని పృథ్వీరాజ్ కొనియాడాడు.
వారణాసికి సంబంధించి ఒక సన్నివేశాన్ని తనకు వివరించినపుడు ఇంత కష్టమైన సీన్ ఎలా తీస్తారు అంటే తనకు తెలియదని రాజమౌళి అన్నాడని, కానీ షూటింగ్ చేసినపుడు మాత్రం సెట్లో అద్భుతంగా ఆ సీన్ చిత్రీకరించాడని పృథ్వీరాజ్ గుర్తు చేస్తున్నాడు.

ఇలాంటి ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డం అద్భుతమైన అనుభ‌వ‌మ‌ని పృథ్వీరాజ్ పేర్కొన్నాడు. వార‌ణాసిలో పృథ్వీరాజ్ కుంభ అనే పాత్ర‌లో మెయిన్ విల‌న్‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. రామాయ‌ణం ఎపిసోడ్లో ఆయ‌న కుంభ‌క‌ర్ణుడిగా క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.