టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత అతడు సక్సెస్ రుచి చూడలేదు. తన పరాజయ పరంపరకు ఈ చిత్రం బ్రేక్ వేస్తుందని ప్రతిసారీ ఆశలు పెట్టుకోవడం, నిరాశ చెందడం మామూలైపోయింది.
గత ఏడాది ‘తమ్ముడు’ సినిమా తన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలవడం, ‘యల్లమ్మ’ తన చేతుల్లోంచి చేజారిపోవడంతో నితిన్ తీవ్ర నిరాశకు గురైనట్లే కనిపించాడు. అందుకే కొత్త సినిమా సంగతి తేల్చడానికి చాలా టైం తీసుకున్నాడు. ఐతే ఇటీవలే సోము, నర్రి అనే ఇద్దరు కొత్త దర్శక ద్వయంతో కలిసి అతను సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఈ చిత్రంలో నితిన్కు జోడీగా ‘మిరాయ్’ భామ రితిక నాయక్ ఎంపికైన సంగతి తెలిసిందే. మూవీ ప్రారంభోత్సవ వేడుకలో కూడా ఆమె కనిపించింది. ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తాజా సమాచారం. అందుకు కారణాలేంటన్నది తెలియలేదు. కానీ ముహూర్త వేడుకలో పాల్గొన్నాక కథానాయిక వైదొలగడం అరుదుగా జరుగుతుంటుంది. మరి తన పెర్ఫామెన్స్ నచ్చకో, పాత్రకు సూటవ్వదనో మేకర్సే తప్పించారా.. లేక ఆమెనే డేట్లు సర్దుబాటు చేయలేకో, క్యారెక్టర్ నచ్చకో తప్పుకుందా అన్నది తెలియాల్సి ఉంది.
ఏదేమైనప్పటికీ కెరీర్ బాగా మైనస్లో ఉన్న టైంలో ఇలాంటి నెగెటివ్ న్యూస్ నితిన్ సినిమాకు శుభసూచకం కాదు. కాగా రితిక స్థానంలో తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యను తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రావచ్చు. రితిక ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై టీం సభ్యులు కానీ, తను కానీ ఏమని స్పందిస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates