కోలీవుడ్‌కు వరం.. టాలీవుడ్‌లో ఆశలు


తమిళనాడులో 100 శాతం కెపాసిటీతో థియేటర్లు నడిపేందుకు అనుమతులిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. దేశంలో ఈ దిశగా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం తమిళనాడే. ఇన్నాళ్లూ అందరూ ఇది కేంద్రం పరిధిలోని విషయం అనే అనుకున్నారు. అక్టోబరు 15 నుంచి దేశంలో థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.. 50 శాతం ఆక్యుపెన్సీతోనే వాటిని నడపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ ఇలా థియేటర్లను నడపడం చాలా కష్టమవుతోంది. ఇది ఇటు థియేటర్లకు, అటు నిర్మాతలకు నష్టం చేకూర్చేదే.

కానీ కేంద్రం ఎప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తుందో అని చూస్తున్నారంతా. ఈ దిశగా వివిధ పరిశ్రమల నుంచి కేంద్రానికి విజ్ఞప్తులు కూడా వెళ్లాయి. ఐతే ఇంతలో తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడానికి అనుమతులివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

కేంద్రం ఇందుకు అభ్యంతరం చెప్పని పక్షంలో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆయా రాష్ట్రాల సినీ పరిశ్రమల నుంచి ఒత్తిడి రావడం ఖాయం. ముఖ్యంగా బాలీవుడ్‌తో సమానంగా దేశంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించే తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు 100 పర్సంట్ ఆక్యుపెన్సీ దిశగా ఆశలు మొలకెత్తాయి. పొరుగు రాష్ట్రంలో 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతి లభించిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఆ అవకాశం కల్పించాలని ప్రభుత్వాలను సినీ పెద్దలు కోరే అవకాశముంది.

తమిళనాడులో మాదిరే ఇక్కడ కూడా సంక్రాంతి సీజన్ కీలకం. ఆ సీజన్లో రిలీజ్‌కు నాలుగు సినిమాలు రేసులో ఉన్నాయి. సంక్రాంతి నుంచే 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తే ఆ చిత్రాలకే కాక సినీ పరిశ్రమకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. విడుదల కోసం మరెన్నో చిత్రాలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో.. వాటన్నింటినీ క్లియర్ చేయడానికి అవకాశం లభిస్తుంది. మరి తమిళనాడును చూసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడ కూడా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపేందుకు అనుమతిస్తారా అన్నది చూడాలి.