సెలబ్రెటీల్లో అయినా.. సామాన్యుల్లో అయినా..ఒకసారి విడాకులు అయ్యాక తమ మాజీ భాగస్వాములతో కలవడానికి అంతగా ఇష్టపడరు. వారి గురించి మాట్లాడడానికి కూడా ఆసక్తి చూపించరు. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం అందుకు భిన్నం. ఆయనకు ఇప్పటికే రెండుసార్లు పెళ్లి జరిగి, విడాకులు అయిన సంగతి తెలిసిందే. ముందుగా రీనా దత్తాను 1986లో పెళ్లాడి 2002లో ఆమె నుంచి విడిపోయారు. తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకుని 2021లో ఆమె నుంచి కూడా విడాకులు తీసుకున్నారు.
ఇప్పుడేమో గౌరీ స్ప్రాట్ అనే బెంగళూరు మహిళతో ఆయన పెళ్లికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా గౌరీతో ఆయన రిలేషన్షిప్లో ఉన్నారు. ఐతే రీనా, కిరణ్ల నుంచి విడిపోయినా సరే.. వారితో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. తరచుగా వాళ్లను కలుస్తుంటారు. కిరణ్ నుంచి విడిపోయాక కూడా ఆమెతో కలిసి సినిమాల కోసం పని చేశాడు ఆమిర్.
ఇదంతా ఒకెత్తయతే.. ఇప్పుడు ఆమిర్ తన మాజీ భార్యలు, కాబోయే భార్యతో కలిసి ఒకే కార్లో ప్రయాణించడం చర్చనీయాంశం అయింది. సందర్భం ఏంటన్నది స్పష్టత లేదు కానీ.. కార్లో ముందు ఆమిర్, వెనుక గౌరీ కూర్చుని ఉండగా.. కిరణ్ రావు, రీనా దత్తా సైతం అదే కారు ఎక్కడం మీడియా కెమెరాల్లో రికార్డ్ అయింది.
ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వసుదైక కుటుంబం అంటే ఇదే అని.. వివాహ బంధం విఫలమైనంత మాత్రాన సంబంధాలను పూర్తిగా తెంచుకోవాల్సిన అవసరం లేదని.. ఇలా అందరూ అర్థః చేసుకుని, సన్నిహితంగా మెలగడం మంచి విషయమే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
విశేషం ఏంటంటే.. త్వరలో జరిగే ఆమిర్, గౌరీల పెళ్లికి కిరణ్, రీనా కూడా హాజరవుతారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఆ దృశ్యాలు మరింతగా సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించడం ఖాయం. ఇక కెరీర్ విషయానికి వస్తే గత ఏడాది సితారే జమీన్ పర్ చిత్రంతో పలకరించిన ఆమిర్.. ప్రస్తుతం త్రీ ఇడియట్స్ సీక్వెల్ సన్నాహాల్లో ఉన్నట్లు వార్తుల వస్తున్నాయి. ఈ చిత్రం కోసం రాజ్ కుమార్ హిరానితో కలిసి ఆయన పని చేయబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates