యూట్యూబర్ సినిమా 350 కోట్లు రాబట్టింది

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇండియాలో ఎంత భారీ వసూళ్లు రాబడుతోందో చూస్తున్నాం, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కథలో అధిక భాగం ఒక్క చిన్న గదిలో జరిగినా సరే ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఒక్క ఇండియాలోనే వంద కోట్ల దాకా వసూళ్లు రావొచ్చని ఒక అంచనా. థియేటర్ రిలీజ్ జరిగి మూడు వారాలు దాటుతున్నా హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో హౌస్ ఫుల్స్ తో ఆడుతోంది. అయితే ఇలాంటి సంచలనం ఇంకో సినిమా చేసిందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.

అమెరికన్ యూట్యూబర్ మార్కిప్లైయర్ కు చాలా పేరు ఉంది. మూడున్నర కోట్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఇతను ‘ఐరన్ లంగ్’ అనే సినిమా తీశారు. బడ్జెట్ కేవలం 4 మిలియన్ డాలర్లు. అంటే మన లెక్కలో సుమారుగా 34 కోట్లన్న మాట. ఎలాంటి స్టూడియోల సపోర్ట్ లేకుండా, ఏ నిర్మాతను కలవకుండా మార్కిప్లైయర్ స్వంతంగా ఈ మూవీ తీశాడు. మార్కెటింగ్ కూడా పెద్దగా చేసుకోలేదు. దీంతో ఫాలోయర్లే సపోర్ట్ గా నిలిచారు. ఐరన్ లంగ్ ప్రచార బాధ్యతలు నిర్వహించారు.

కట్ చేస్తే జనవరిలో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. సుమారుగా 350 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించుకుంది. అబ్సెషన్ లాగే ఇందులో కూడా షాకింగ్ స్టోరీ ఉంటుంది. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం నాశనం అయిపోయాక కేవలం కొన్ని గ్రహాలు మాత్రమే ఉంటాయి. ఒక రక్తపు సముద్రంలో నిక్షిపమైన రహస్యాలను తెలుసుకునేందుకు బ్రతికి ఉన్న అతి కొద్ది మనుషులు ఒక పాత సబ్ మెరైన్ లో హీరోని ఒంటరిగా పంపిస్తారు. ఆ తర్వాత జరిగేదే అసలు స్టోరీ.

కేవలం 2 గంటల 7 నిమిషాల నిడివితో రూపొందిన ఐరన్ లంగ్ యూఎస్ లో ఘనవిజయం సాధించింది. దీన్ని మన దేశంలోనూ విస్తృతంగా రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాంటి స్టార్ స్టేటస్ లేని ఒక యూట్యూబర్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వడం మూవీ మేకర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. సూపర్ హీరోస్ కథలకు దూరంగా అతి తక్కువ బడ్జెట్ లో రూపొందుతున్న ఇలాంటి అద్భుతాలను చూసి ప్యాన్ ఇండియా పేరుతో సమయాన్ని వృథా చేస్తున్న వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి.