ఇంకో మెట్టు ఎక్కేసావయ్య విజయ్

ఎంత సంపాదించినా.. అందులోంచి ఎంతో కొంత లేని వారికి ఇవ్వడంలో ఉండే సంతోషమే వేరు. ఈ ఆనందాన్ని అందరూ అనుభవించరు, ఆస్వాదించరు. తెలుగు సినిమాల్లో చాలా వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ఎప్పటికప్పుడు తన సేవా దృక్పథాన్ని చాటుకుంటూనే ఉంటాడు. తనను ఇంత వాణ్ని చేసిన ప్రేక్షకులు, అభిమానుల కోసం ఎంతో కొంత తిరిగి ఇస్తూనే ఉంటాడు.

ఛారిటీ విషయంలో పెద్దగా ప్లాన్ చేయకుండానే, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం విజయ్‌కి అలవాటు.
ఇలాగే ఫిబ్రవరిలో తన తండ్రి సొంత ఊరు అయిన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటకు వెళ్లినపుడు.. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. రష్మికను పెళ్లాడిన తర్వాత ఆమెతో కలిసి తుమ్మన్‌పేటలో తమ కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేశాడు విజయ్.

ఇప్పుడు మాట నిలబెట్టుకుంటూ విజయ్, రష్మిక వెళ్లి.. అచ్చంపేటకు వెళ్లి ఆ డివిజన్‌ పరిధిలోని 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. తొమ్మిది, పది తరగతుల్లో ప్రతి పాఠశాల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన స్టూడెంట్స్ లిస్ట్ తెప్పించుకుని వారికి ఆర్థిక సాయం అందజేశారు. విజయ్, రష్మిక స్వయంగా అచ్చంపేటకు వెళ్లి ఒక కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించారు.

ఈ సాయం ద్వారా విద్యార్థులకు అందే ఆర్థిక తోడ్పాటు ఒకెత్తయితే.. ఇలాంటి పెద్ద సెలబ్రెటీల చేతుల మీదుగా స్కాలర్‌షిప్స్ తీసుకోవడం వారిలో ఎంత స్ఫూర్తి నింపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది వారి జీవితాలను మలుపు తిప్పే ఘట్టంగా భావించవచ్చు. ఫిలిం సెలబ్రెటీలనే కాక.. ఏ రంగానికి చెందిన ప్రముఖులైనా ఇలాంటి కార్యక్రమాల్లో భాగం అయితే విద్యార్థులకు అది గొప్ప ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.