కింద కూర్చోవడంపై నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే?

తక్కువ సినిమాలతోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుని, ‘కల్కి’తో వెయ్యి కోట్ల క్లబ్బులో కూడా అడుగు పెట్టిన నాగ్ అశ్విన్.. ఏమాత్రం దర్పం చూపించకుండా ఎంత సింపుల్‌గా ఉంటాడో తెలిసిందే. ఇప్పటికీ చిన్న మారుతి జెన్ కారు వేసుకుని ఒక్కడే హైదరాబాద్ రోడ్ల మీద తిరిగేస్తుంటాడు. తన సింప్లిసిటీ గురించి మామ అశ్వినీదత్ సైతం ఎంతో ఆశ్చర్యపోతూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మీద గౌరవంతో ఆయన కలల ప్రాజెక్టు ‘సింగ్ గీతం’కు అన్నీ తానై వ్యవహరించిన నాగి.. ఈ సినిమాను ప్రమోషన్లను కూడా ముందుండి నడిపించాడు. ఇటీవల ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సింగీతం స్టేజ్ మీదికి వెళ్లి, మాట్లాడుతున్నపుడు.. కింద అతిథులంతా కుర్చీల్లో కూర్చుని ఉంటే, నాగి పక్కన నేల మీద నేల మీద కూర్చోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నాగి చెప్పులు కూడా వేసుకోలేదు.

ఐతే సింగీతం మీద గౌరవంతోనే నాగి కింద కూర్చున్నాడని, అందుకే చెప్పులు కూడా వేసుకోలేదనే చర్చ జరిగింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు నాగిది అతి వినయం అంటూ కౌంటర్లు కూడా వేశారు. దీనిపై తాజాగా నాగి స్పందించాడు. తనకు సింగీతం మీద ఎంతో భక్తి ఉన్న మాట వాస్తవమే అని.. ఆయన స్టేజ్ మీదికి వెళ్లినపుడు తాను కంఫర్టబుల్‌గా కింద కూర్చుని ప్రసంగాన్ని తిలకించినట్లు నాగి చెప్పాడు.

కింద కూర్చున్నపుడు చెప్పులు ఉంటే ఇబ్బంది కాబట్టి, వాటిని తీసి ముందు పెట్టుకున్నాను తప్పితే, అందులో ప్రత్యేకంగా స్వామి భక్తి అనేదేమీ లేదని తేల్చేశాడు నాగి. తాను కింద కూర్చోవడాన్ని పెద్ద విషయంగా చూడాల్సిన అవసరం లేదని.. దానికి స్వామి భక్తికి సంబంధం లేదని చెప్పాడు నాగి. ఇక జూన్ 11కు అనుకున్న సినిమాను ఒక రోజు వాయిదా వేయడానికి, మూవీ రెడీ కాకపోవడమే కారణమని.. పూర్తిగా సంగీతంతో ముడిపడ్డ సినిమా కావడంతో రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో కొంత ఆలస్యం జరిగిందని నాగి వెల్లడించాడు.