ప్రచారం కోసం ప్రాణం పెట్టేస్తున్నారు

ఈ వారం విడుదల కాబోతున్న సింగ్ గీతం సినిమాకు టీమ్ చేస్తున్న ప్రమోషన్లు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 94 వయసులో ఒక ఫిలిం మేకర్ పడిన తపనను ఆడియెన్స్ దగ్గరికి తీసుకెళ్లే ఉద్దేశంతో నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న నాగ్ అశ్విన్ ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కమల్ హాసన్ ని తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం దగ్గరి నుంచి అవుట్ డోర్ పబ్లిసిటీ దాకా వైజయంతి మూవీస్ సంస్థ ప్రత్యేక స్ట్రాటజీ అనుసరిస్తోంది.

హైదరాబాద్ ఫిలిం నగర్ దారిలో ఉన్న నిలువెత్తు గోడల మీద దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలను జీవం ఉట్టిపడేలా సజీవమైన పెయింటింగ్స్ వేయించడం ఆగి మరీ చూసేలా చేస్తోంది. వైజాగ్ బీచ్ లో ఆదిత్య 369 మెషీన్ ని పెట్టి పిల్లలు పెద్దలకు సందర్శనం కలిగించడం ఆకట్టుకుంటోంది. ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర ఆడియో క్యాసెట్ బొమ్మ ఒకటి పెట్టి దాని మీద సింగీతం క్లాసిక్స్ ని ప్రింట్ చేయించి వెరైటీగా జనాన్ని ఇటు చూసేలా చేస్తున్నారు.

సింగ్ గీతంలో స్టార్లు లేరు. అధిక శాతం కొత్తవాళ్లే. పైగా డైలాగులు లేకుండా కేవలం పాటలతో మాట్లాడుకునే వెరైటీ కాన్సెప్ట్ ని సింగీతం శ్రీనివాసరావు గారు తీసుకున్నారు. ఒకప్పుడు పుష్పక విమానం సృష్టించిన సంచలనం ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందనే నమ్మకం టీమ్ సభ్యుల్లో ఉంది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ ఇది తన గురువుకు అర్పిస్తున్న దక్షిణ తరహాలో అసలే కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా మంచి థియేటర్ రిలీజ్ దక్కేలా చూసుకుంటున్నారు.

పెద్ది తప్ప బాక్సాఫీస్ వద్ద మరో ఆప్షన్ లేకపోవడంతో టాక్ కనక పాజిటివ్ గా వస్తే సింగ్ గీతం నిలబడే ఛాన్స్ ఉంది. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కీలక పాత్ర పోషించనుంది. పన్నెండు పైగా పాటలంటే మ్యూజిక్ లవర్స్ కు పండగే. సింగ్ గీతం కనక సక్సెస్ అయితే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. ఇంకా మూడు రోజులు టైం ఉంది కాబట్టి వీలైనంతగా సినిమాని జనం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి.