ఎంత పెద్ద దర్శకుడైనా సరే.. 70 ఏళ్లు దాటిందంటే సినిమా చేయడం కష్టం. ఎంతోమంది దిగ్గజ దర్శకులు ఆ వయసుకు వచ్చాక ఇక చాలు అనేసిన వాళ్లే. వయసు మళ్లిన దర్శకులతో సినిమాలు చేయడానికి నిర్మాణ సంస్థలు కూడా ముందుకు రావు. కానీ 94 ఏళ్ల వయసులో ఒక దర్శకుడితో సినిమా తీసి ఔరా అనిపిస్తోంది ఒక నిర్మాణ సంస్థ. ఆ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కాగా.. ఆ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.
ఈ కలయిక సాధ్యం చేసింది, సింగ్ గీతం అనే సినిమాను సుసాధ్యం చేసింది దర్శకుడు నాగ్ అశ్వినే. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి చిత్రాలతో అబ్బురపరిచిన ఈ దర్శకుడు.. అనుదీప్ కేవీ లాంటి యువ దర్శకుడికి అండగా నిలిచి జాతిరత్నాలు సినిమాతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే.
ఐతే అలాంటి యువ దర్శకుడిని నమ్మడం కంటే.. 94 ఏళ్ల వయసులో సింగీతంతో సినిమా చేయించడం గొప్ప విషయం. ఈ సినిమాకు తెర వెనుక ఉండి అన్నీ చూసుకున్నది నాగ్ అశ్వినే అని సింగ్ గీతం ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అందరికీ అర్థమైంది.
90 ఏళ్లు దాటాక కూడా సింగీతం యాక్టివ్గానే కనిపించేవారు. కానీ సింగ్ గీతం సినిమా తీస్తున్నపుడు ఆయన ఏ స్థితిలో ఉన్నారో ఏమో కానీ.. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం లేచి నిలబడలేని, సరిగా మాట్లాడలేని స్థితిలో కనిపించారు. చక్రాల కుర్చీలో స్టేజ్ మీదికి వచ్చిన ఆయన.. ప్రసంగించేటపుడు పదాలు సరిగా పలకలేకపోయారు.
ఇలాంటి స్థితిలో సింగీతం ఎలా సినిమా తీయగలిగారు అనే సందేహం కలిగింది అందరికీ. ఐతే ఈ సినిమా కథ, షాట్స్ తనవే అయినా.. మేకింగ్లో అన్నీ దగ్గరుండి చూసుకున్నది వైజయంతీ మూవీస్ టీం, నాగ్ అశ్విన్ అని.. ఈ సినిమా క్రెడిట్ అంతా నాగికే ఇవ్వాలని స్వయంగా సింగీతమే చెప్పారు. దీంతో నాగి సింగీతం కోసం ఎంత చేశాడో అందరికీ అర్థమైంది.
ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవద్వీపం సహా ఎన్నో అద్భుతమైన ప్రయోగాలతో తెలుగు చిత్ర పరిశ్రమకే కాక ఇండియన్ సినిమాకు సింగీతం చేసిన సేవ అమూల్యం. అలాంటి దర్శకుడు ఎన్నో ఏళ్లుగా ఒక కథ విషయంలో కలలు కంటుంటే.. దానికి క్రియేటివ్గానే కాక ఆర్థికంగానూ సపోర్టుగా నిలిచి.. 94 ఏళ్ల వయసులో సింగీతం తన కల నెరవేర్చుకునేలా చేసినందుకు నాగిని ఎంత కొనియాడినా తక్కువే.
Gulte Telugu Telugu Political and Movie News Updates