తేడా అంటూనే డబుల్ సెంచరీ కొట్టింది

దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం. తెలుగులో పెద్దగా అద్భుతాలు చేయలేదు కానీ ఉన్నంతలో వారం రోజులు డీసెంట్ ఆక్యుపెన్సీలు నమోదు చేయడం వాస్తవం. వెంకటేష్ స్థానంలో మోహన్ లాల్ ని మన ప్రేక్షకులు చూస్తారా లేదానే అనుమానాలకు చెక్ పెడుతూ ఎంతో కొంత వసూళ్లు అయితే ఇచ్చారు. మలయాళంలో ఇది టాప్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

ఇక్కడో విషయం గమనించాలి. దృశ్యం 3కి మొదటి రెండు భాగాల్లాగా యునానిమస్ రెస్పాన్స్ రాలేదు. మిక్స్డ్ టాక్ ఎక్కువ వినిపించింది. చివరి నలభై నిముషాల ట్విస్టులు మినహాయించి మిగిలినదంతా దర్శకుడు జీతూ జోసెఫ్ టీవీ సీరియల్ తరహాలో తీశాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయినా సరే అవేవి ఆడియన్స్ ని ఆపలేకపోయాయి. జార్జ్ కుట్టి ఈ క్రైమ్ ని ఎలా ముగించాడనే ఆసక్తితో ఆడియన్స్ థియేటర్లకు వెళ్లారు.

దెబ్బకు లోకా, తుదరుమ్, వాలా 2, మంజుమ్మల్ బాయ్స్ దాటి వేగంగా రెండు వందల కోట్ల క్లబ్బులో చేరిన మూవీగా దృశ్యం 3 కొత్త రికార్డు సృష్టించింది. మొదటి స్థానంలో ఎల్ 2 ఎంపురాన్ ఉంది ఫైనల్ రన్ ఇంకా దూరంలో ఉంది కాబట్టి ట్రిపుల్ సెంచరీ కావొచ్చనే అంచనా ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉంది. ఇతర భాషల్లో దృశ్యం 3 ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. పెద్ది జూన్ 4 విడుదలవుతున్న నేపథ్యంలో కేరళ మినహాయించి వేరే రాష్ట్రాల్లో క్లోజింగ్ వచ్చేస్తుంది.

ఇక దృశ్యం 4 ఉంటుందా లేదానే దాని మీద రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి. ఇక్కడితో ఆపేయడం బెటరని క్రిటిక్స్ అంటుండగా మోహన్ లాల్ ఫ్యాన్స్ కొనసాగించాలని కోరుతున్నారు. కొడుకుని పోగొట్టుకున్న లేడీ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఏం చేసిందో చూడాలని అడుగుతున్నారు. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం టీమ్ నుంచి రాలేదు కానీ మూవీ సక్సెస్ అయితే కొనసాగిస్తామని గతంలో జీతూ జోసెఫ్ అన్నారు కాబట్టి ఆ మాట ప్రకారమైతే ఫ్రాంచైజ్ ఉండే ఛాన్స్ ఎక్కువే.