జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్ త్వరలో విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సెన్సార్ సర్టిఫికెట్ రాగానే జూన్ 19 డేట్ వేసేందుకు నిర్మాత సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే తమిళ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర సమాచారం ఉంది. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే దాకా ఏదీ ఖరారుగా చెప్పలేరు కాబట్టి దాని కోసం ఎదురు చూస్తున్నారు.

విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తొలిసారి దర్శకత్వం వహించిన సిగ్మా జూలై 31 థియేటర్లలో అడుగు పెట్టనుంది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ఇందులో జంటగా నటించారు. ఇక్కడ విశేషం ఏంటంటే విజయ్ సిఎం ప్రమాణ స్వీకారానికి భార్య పిల్లలు రాలేదు. జేసన్ కూడా కనిపించలేదు. దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. విభేదాలతో పాటు త్రిష గురించి జరుగుతున్న ప్రచారం వల్లే దూరంగా ఉన్నారని మాట్లాడుకున్నారు.

ఇప్పుడు సిగ్మా టైంలో విజయ్ ఫ్యాన్స్ జేసన్ కు మద్దతుగా ఉంటారా లేదానేది వేచి చూడాలి. నిజానికి తనను స్క్రీన్ మీద జూనియర్ విజయ్ గా చూడాలని వాళ్ళు కోరుకున్నారు. దానికి భిన్నంగా అతను డైరెక్షన్ ఎంచుకున్నాడు. ఒకవేళ మనసు మార్చుకుని తిరిగి యాక్టింగ్ అంటాడేమో చూడాలి. సిగ్మాని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. తమన్ సంగీతం సమకూర్చారు. వచ్చే నెల నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నారు.

కాకపోతే జేసన్ కు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అయితే వస్తుంది. ప్రమోషన్స్ కు వెళ్ళినప్పుడు విజయ్ ప్రస్తావన లేకుండా మీడియా ప్రశ్నలు అడగదు. దాన్ని తప్పించుకోవడం అంత సులభం కాదు. అందులోనూ విడాకుల కేసు ఇంకా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇతను ఏమన్నా అదో పెద్ద డిబేట్ అయిపోతుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైతేనేం తక్కువ గ్యాప్ లో తండ్రి కొడుకుల సినిమాలు మూవీ లవర్స్ మధ్య ఇంటరెస్టింగ్ టాపిక్స్ గా మారబోతున్నాయి.