విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది. ఏపీ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు గురించి క్లారిటీ వచ్చేసినట్టే. అధికారిక ఉత్తర్వులు ఇంకా బయట పెట్టలేదు కానీ అనుమతులు ఇచ్చారని సమాచారముంది. నైజామ్ పర్మిషన్ల కోసం నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కోర్టుతో ముడిపడిన వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోనుంది.

ఇక అసలైన ఘట్టం జూన్ 1 రాబోతోంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు మొదలైపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే పెద్ది ఆడబోయే పబ్లిసిటీ క్రికెట్ లో ఇది చివరి బంతి. ఖచ్చితంగా బౌండరీ దాటాలి ఇంకా చెప్పాలంటే బాల్ స్టేడియం బయటికి వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ లో ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ మినహాయించి పెద్ద వేడుక చేసే సూచనలు లేవని ఇన్ సైడ్ టాక్. సో బెజవాడ సౌండ్ మోగిపోవాలి.

సమస్య ఎక్కడ వచ్చిందంటే ట్రైలర్ కు యునానిమస్ టాక్ రాలేదు. మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. సోషల్ మీడియాని ఊపేస్తుందనుకున్న ఐటెం సాంగ్ రీచ్ కూడా గొప్పగా చెప్పుకునే స్థాయిలో లేదు. దీని వల్ల నార్త్ ఇండియా బజ్ మీద ప్రభావం పడింది. కంటెంట్ మీద నమ్మకంతో మేకర్స్ ఈ విషయంలో టెన్షన్ పడటం లేదు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో బజ్ వచ్చేందుకు ఇవి చాలకపోవచ్చు. భోపాల్ ఈవెంట్ సక్సెస్ కావడం ఊరట కలిగించే విషయం.

మొదటి రోజు రికార్డుల మీద ఎవరికీ డౌట్లు లేవు కానీ నెంబర్లు పెద్ద స్థాయిలో రావాలంటే జనం పెద్దికి ఓ రేంజ్ లో కదలాలి. గత మూడు నెలలుగా సరైన మాస్ సినిమా లేక అల్లాడిపోతున్న థియేటర్ వ్యవస్థకు పెద్దినే పెద్ద దిక్కు కానుంది. ఇది ఇచ్చే బూస్ట్ తోనే నెక్స్ట్ రాబోయే మా ఇంటి బంగారం, లెనిన్ లాంటివి తమ ప్రచారాలను వేగవంతం చేస్తాయి. గెస్టులుగా ఎవరొస్తారనే ఇన్ఫో ఇంకా రావాల్సి ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.