బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. కొత్తది ఫిక్స్ చేశాడు

ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం పుష్కరం కంటే ఎక్కువ కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. 2013లో వచ్చిన ‘సింగం-2’ ఆయన చివరి క్లీన్ హిట్. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఒక మాదిరిగా ఆడాయి కానీ.. నిఖార్సయిన హిట్లు కాలేదు. సినిమా సినిమాకూ వసూళ్లు పడిపోతుండడంతో ఆయన అభిమానుల వేదన అంతా ఇంతా కాదు. వెయ్యి కోట్లు గ్యారెంటీ అనుకున్న ‘కంగువ’ అందులో పదో వంతు వసూళ్లు కూడా రాబట్టలేకపోవడంతో సూర్య పనైపోయిందనే నిర్ణయానిక వచ్చేశారందరూ.

ఇలాంటి టైంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) సినిమా ఊహించని విజయాన్నందుకుంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాకు వసూళ్ల విషయంలో ఢోకా లేకపోయింది. రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా సాగుతున్న ఈ చిత్రం.. సూర్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ ఊపులో తన కొత్త సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయించేశాడు సూర్య.

‘కరుప్పు’ తర్వాత సూర్య చేస్తున్నది తెలుగు సినిమా కావడం విశేషం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రమే.. విశ్వనాథ్ అండ్ సన్స్. ఇంతకుముందు వెంకీ దర్శకత్వంలో రంగ్ దె, సార్, లక్కీ భాస్కర్ చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆల్రెడీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తోంది. ‘కరుప్పు’ రిలీజ్ కోసం ఆగిన టీం.. ఆ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ కావడంతో విడుదల ఖాయం చేసుకుంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో, ఆగస్టు 14న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. లాంగ్ వీకెండ్‌ను ఉపయోగించుకునేలా పర్ఫెక్ట్ డేట్ ఎంచుకుంది టీం. ఈ క్రేజీ వీకెండ్‌కు వివిధ భాషల్లో పేరున్న సినిమాలు రిలీజవుతుంటాయి.

ఐతే మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ ఆ వీకెండ్లోనే వస్తుందని వార్తలు వచ్చినా, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. హిందీలో సల్మాన్ ఖాన్ మూవీ ‘మాతృభూమి’ కూడా ఆ వీకెండ్లోనే రావాల్సి ఉన్నా దాని గురించి కూడా అనౌన్స్‌మెంట్ రాలేదు. సూర్య సినిమా ముందుగా అధికారిక ప్రకటన చేయడం ద్వారా కర్చీఫ్ వేసేసింది. ఒక బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సూర్య సినిమా, పైగా మంచి బజ్ ఉంది. దీనికి తోడు క్రేజీ డేట్ ఎంచుకున్నారు. కాబట్టి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు పాజిటివ్ టాక్ వస్తే సూర్య ఖాతాలో మరో పెద్ద హిట్ జమ కావడం ఖాయం.