నైజామ్ సింగల్ స్క్రీన్లలో తక్షణం పర్సెంటెజ్ విధానం అమలు చేయాలని పట్టువదలకుండా పోరాడుతున్న ఎగ్జిబిటర్లు చిరంజీవి ప్రమేయం తర్వాత శాంతించారు. రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు జరిగిన సమావేశాల ద్వారా మెగా హామీ దొరకడంతో పెద్దికి దారి వదిలారు. అంటే ఈ సినిమాతో పాటు జూన్ లో వచ్చే ఇతర చిత్రాలు రెంటల్ పద్దతిలోనే ఆడతాయి. కమిటీ ఇచ్చే రిపోర్ట్ అనుగుణంగా జూలై 3 నుంచి పర్సెంటెజ్ విధానాన్ని తెలంగాణ వ్యాప్తంగా తీసుకురానున్నారు.
ఓపికగా ఎగ్జిబిటర్ల సమస్యలను సావధానంగా విన్న చిరంజీవి వాటిని నెరవేర్చే విధంగా తన వంతుగా చేయగలిగింది చేస్తానని, ఇలా హఠాత్తుగా ఇప్పటికిప్పుడు సిస్టమ్ లో మార్పులు చేయడం కష్టం కాబట్టి ఆ మేరకు సర్దిచెప్పడంతో మీటింగ్ కు హాజరైన సభ్యులు కన్విన్స్ అయినట్టుగా తెలిసింది. ఒకవేళ ఏపీలో కనక టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు వస్తే ఆ మేరకు అద్దెతో పాటు ఏడున్నర శాతం అదనంగా చెల్లించే వెసులుబాటుకి అంగీకారం వచ్చినట్టుగా తెలిసింది.
ఏదైతేనేం చిక్కుముడి వీడింది. నిన్న ఏపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ని నిర్మాతలు కలిసి వచ్చిన తర్వాత ఇవాళ జరిగిన తాజా పరిణామాలు ఇవి ఎగ్జిబిటర్లు చిరు ప్రమేయం పట్ల సంతోషంగానే ఉన్నారు. వాళ్ళుగా కోరుకున్న చొరవ కాబట్టి ఆ మేరకు మెగాస్టార్ కూచోబెట్టుకుని సావధానంగా పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఇక గత వారం ఛాంబర్ నియమించిన కమిటీ ఇవ్వబోయే రిపోర్ట్ చాలా కీలకం కానుంది. వాటి రికమండేషన్ ఆధారంగా నిర్ణయాలు ఉండబోతున్నాయి.
ఇంకొక్క వారంలో పెద్ది రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో భారీ సెలబ్రేషన్స్ కు రంగం సిద్ధం అయినట్టే. ఈ మొత్తం ఇష్యూలో మరిన్ని సినిమాలు లాభపడబోతున్నాయి. ముఖ్యంగా సమంత మా ఇంటి బంగారం, అఖిల్ లెనిన్ విడుదల జూన్ లోనే కాబట్టి కొత్తగా రాబోయే కండీషన్ల పరిధిలోకి తీసుకోరు. జూలై నుంచి అంటున్నారు కాబట్టి అక్కడి నుంచి ఏ పెద్ద హీరో సినిమా అయినా పర్సెంటెజ్ విధానంలో వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే కథ సుఖాంతమయ్యింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates