కఠోర వాస్తవాలు చెప్పిన ‘బేబీ’ దర్శకుడు

భాషా భేదం లేకుండా అన్నిచోట్లా సినిమాలకు గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా పరిస్థితి దయనీయంగా మారింది. పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయామని గొప్పలు పోవడమే కానీ.. సినిమాలకు వసూళ్లు పడిపోయాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టమవుతోంది. డిజిటల్ హక్కుల రేట్లు పడిపోయాయి.

థియేటర్ల నుంచి వచ్చే షేర్ తగ్గిపోయి నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ సంకేతాలు కనిపిస్తున్నాయి. మంచి కంటెంట్ ఇవ్వడం పోయి.. ప్రేక్షకులను మోసం చేస్తున్నారనే భావన కూడా పెరిగిపోతోంది. ప్రమోషన్ గిమ్మిక్కుల ఏదో చేస్తున్నారు కానీ.. చివరికి థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి కావాల్సిన కంటెంట్ లేకపోవడంతో వాళ్లు క్రమంగా సినిమాలు చూడడం తగ్గించేస్తున్నారు. ఐతే ఈ వాస్తవ పరిస్థితుల గురించి ఓపెన్‌గా మాట్లాడేవాళ్లు తగ్గిపోయారు.

ఐతే ‘సమ్మర్ హాలిడేస్’ అనే చిన్న సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో ‘బేబీ’ దర్శక నిర్మాత సాయి రాజేష్ ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ఓపెన్ అయ్యాడు. ఒక ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తుంటే లోలోన కంగారు తప్పట్లేదని అతనన్నాడు.

ఫిలిం మేకర్స్‌గా తాము యూట్యూబ్‌లో వ్యూస్‌ను, లైక్స్‌ను, కామెంట్లను కొనేస్తున్నామని.. అలాగే సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లను పాజిటివ్‌గా మార్చేస్తున్నామని.. దీంతో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలియని అయోమయంలో పడిపోయిన ప్రేక్షకులు.. తమను నమ్మడం మానేశారని.. థియేటర్లకు రావడం కూడా తగ్గించేశారని సాయిరాజేష్ వ్యాఖ్యానించాడు.

సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలకు సానుకూల స్పందన లభిస్తోంది. ఇండస్ట్రీ జనాలు చేస్తున్న మోసాన్ని సాయిరాజేష్ ఒప్పుకోవడం గొప్ప విషయం అని, ఇది ఇండస్ట్రీ మొత్తం ఆలోచించాల్సిన విషయమని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండస్ట్రీ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్‌లో ఉందని, పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఈ విషయడం చెప్పడానికి తనకు భయమేమీ లేదని ఇదే వేడుకలో వ్యాఖ్యానించడం గమనార్హం.