సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడకుండా, వాటి పొడే గిట్టనట్లు ఉండిపోయిన.. దిగ్గజ స్థాయి ఉన్న వ్యక్తులు.. ఒక రాజకీయ నాయకుడికి ఎలివేషన్ ఇస్తూ వ్యాఖ్యానాలు చేస్తే ఆశ్చర్యం కలగక మానదు.
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుని లెజెండరీ స్టేటస్ తెచ్చుకున్న తనికెళ్ల భరణి.. ఇప్పుడు ఎక్స్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన ఎవ్వరూ ఊహించని స్థాయిలో పొగిడేశారు.
ఆయన్ని కలిసినందుకు పరవశించిపోయారు. మోడీ ఆదివారం హైదరాబాద్లో పర్యటించిన సంగతి తెలిసిందే. తిరిగి దిల్లీ వెళ్లే ముందు విమానాశ్రయంల ఆయన్ని కలిసిన వ్యక్తుల్లో తనికెళ్ల భరణి కూడా ఉన్నారు.
తాను చేతులెత్తి నమస్కరిస్తుండగా, వారిస్తూ తన చేతులను మోడీ పట్టుకున్న ఫొటోను భరణి ఎక్స్లో పోస్ట్ చేసి దానికి ఒక వ్యాఖ్య జోడించారు. నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం అని ఆయన కామెంట్ పెట్టారు.
ఇది బీజేపీ వాళ్లకు ఆనందం కలిగిస్తున్నప్పటికీ.. యాంటీ మోడీ ఫ్యాన్స్కు, అలాగే న్యూట్రల్స్కు మాత్రం నచ్చట్లేదు. భరణి స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్ పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. దేవుళ్లతో మోడీని పోల్చడమేంటి.. ఆయన్ని ముట్టుకున్నందుకు జన్మ ధన్యం అనడమేంటి.. మీ స్థాయికి ఇది తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఐతే దేశంలో హిందూ సంస్కృతిని కాపాడుతున్న మోడీ మీద భరణికి అంత ప్రేమ, గౌరవం ఉంటే తప్పేముందని.. ప్రకాష్ రాజ్ లాగా మేధావి, లిబరల్ అనిపించుకోవాలంటే మోడీని వ్యతిరేకించాలా అంటూ బీజేపీ వాళ్లు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తన మనసుకు అనిపించింది చెప్పారంటూ భరణిని కొనియాడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates