ఒక రోజుకే ప్రేక్షకులు మర్చిపోయారు

సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. మొదటి వీకెండ్ పట్టుమని అయిదు కోట్లు కూడా వసూలు చేయలేని పరిస్థితిలో రెండో వారానికే చేతులు ఎత్తేసేందుకు రెడీ అయ్యింది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీని తెలుగులో ఒక రోజు పేరుతో డబ్బింగ్ చేశారు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహా ఇది వచ్చిందనే సంగతి చాలా మంది ఫ్యాన్స్ కి తెలియదు.

అసలు తప్పంతా అమీర్ ఖాన్ దేనని చెప్పక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రీమేకుల మీద అతిగా ఆధారపడుతూ ఆఖరికి వారసుడికి కూడా వాటినే ఎంచుకోవడం బ్లండర్ అవుతోంది. లుక్స్, యాక్టింగ్ పరంగా ఇంకా ఓనమాల స్టేజిలో ఉన్న జునైద్ ఖాన్ మీద ఇంత సీరియస్ సబ్జెక్టు వర్కౌట్ కాదని తెలిసే సాయిపల్లవి లాంటి పెర్ఫార్మర్ ని తెచ్చుకున్నారు. నటనకి ఇంత స్కోప్ ఉండబట్టే తను ఒప్పుకుంది. తీరా చూస్తే ఇదేమో మెగా డిజాస్టర్ అయ్యింది.

పోటీలో ఉన్న రాజా శివాజీ వల్ల ఏక్ దిన్ కు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. అసలు కంటెంట్ బాలేకపోవడమే ఆడియన్స్ ని దూరం చేసింది. సైయారా లాగా కనీసం మంచి పాటలు, ఎమోషన్స్ ఉన్నా ఏదోలా పాస్ అయిపోయేది. కానీ దాని దరిదాపుల్లో కూడా జునైద్ మూవీ లేదు. దీంతో ఆడియన్స్ తిరస్కారం తప్పలేదు. థియేటర్ బిజినెస్ లెక్కల్లో చూసుకుంటే భారీ నష్టం తప్పేలా లేదు. సగం రికవరీ జరిగినా అద్భుతమే అంటున్నాయి బయ్యర్ వర్గాలు.

ఆసలు ఇది ఒప్పుకోకుండా నేరుగా రామాయణతో లాంచ్ అయ్యుంటే సాయిపల్లవికి సూపర్ మెమరీ అయ్యేది. కానీ అమీర్ ఖాన్ అభ్యర్ధనని మన్నించడం ఇంత చేటు చేసింది. ఒక రోజు గతాన్ని మర్చిపోయే రోగిగా తన పాత్రకు తగ్గట్టే జనాలు ఒక్క రోజులోనే ఈ సినిమాని మర్చిపోయే ఫలితం ఇచ్చారు. ప్రస్తుతానికి ప్రమోషన్లు ఆపేశారు. మళ్ళీ మొదలుపెట్టే అవకాశాలు లేవు. ఫిదా నుంచి చూసుకుంటే సాయిపల్లవికి తెలుగు రాష్ట్రాల్లో వరస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది ఈ ఏక్ దిన్ అలియాస్ ఒక రోజే.