94 వయసులో ‘సింగీతం’ మాయాజలం

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ కు పని చేసిన వ్యక్తి ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు కానీ ఇది అక్షరాలా నిజం. 94 సంవత్సరాల వయసులో మెగా ఫోన్ చేపట్టిన సింగీతం శ్రీనివాసరావుగారికి స్వప్న సినిమా సంస్థ దన్నుగా నిలవగా ఆయన్ని విపరీతంగా అభిమానించే నాగ అశ్విన్ నిర్మాతగా మారి సకలం చూసుకుంటున్నారు. జూన్ 11 విడుదల కాబోతున్న సింగ్-గీతం టీజర్ ఇవాళ రిలీజ్ చేశారు.

కథేంటో సింపుల్ గా క్లూ ఇచ్చారు. కుబేరపురం అనే ఊరికి ఓ కుర్రాడు వస్తాడు. అక్కడ మనుషులు స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉంటారు. కానీ అక్కడికి దగ్గరలో ఉన్న గుహల్లో ఏదో అంతు చిక్కని రహస్యం ఉంటుంది. అదేంటో ఎవరికి తెలియదు. గ్రామస్థులకు అయోమయంగా ఉంటుంది. దెయ్యాలు భూతాలు కాదు కానీ ఏదో అర్థం కాని శక్తి వాళ్ళను ఆటపట్టిస్తుంది. అదేంటి, అసలు హీరో అక్కడికి ఎందుకు వచ్చాడు లాంటి ప్రశ్నకు సమాధానం తెరమీద చూడాలి.

ఈ మధ్య జెన్ జీ డైరెక్టర్లు ప్రెజెంటేషన్ సమస్యతో బాధ పడుతున్నారు. కనీసం ఒక ఇంటరెస్టింగ్ టీజర్ కట్ చేయడంలో కూడా వైఫల్యం చెందుతున్నారు. కానీ ఆశ్చర్యకరంగా సింగీతం అందించిన ఈ సింగ్ గీతం విజువల్స్ చాలా ఇంటెన్స్ తో ఆసక్తి రేపెలా ఉన్నాయి. ఆర్టిస్టులను ఎంచుకోవడం దగ్గరి నుంచి ఆర్ట్ వర్క్ చేయించుకోవడం వరకు పెద్దాయన మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. డజను పాటలు ఉన్న ఈ మ్యూజికల్ బొనంజాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

అసలు సింగీతం వారు పడిన తపన కోసమైనా ఈ సినిమాని చూడాలి. ఆదిత్య 369, భైరవ ద్వీపం, విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు, పుష్పక విమానం లాంటి ఎవర్ గ్రీన్ మూవీస్ అందించిన సింగీతం శ్రీనివాసరావు గారు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో నటుడిగా వరుడు లాంటి వాటిలో కనిపించినా పరిమితంగానే ఎంచుకున్నారు. పెద్ది వచ్చిన కేవలం వారం రోజులకే వచ్చే సాహసం చేయడం చూస్తే కంటెంట్ మీద గట్టి నమ్మకమే ఉంది.