పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ మధ్య డైరెక్షన్ కంటే ఎక్కువగా యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తూ చెప్పుకోదగ్గ సినిమాలే చేస్తున్నాడు. మిత్రుల సహకారం ఉండటంతో అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే ప్రేక్షకుల నుంచి కథానాయకుడిగా ఇంకా అంగీకారం దొరకలేదు. ఆ మధ్య వచ్చిన ఓం శాంతి శాంతి శాంతి దారుణంగా ఫెయిలవ్వడమే కాదు కనీస ఓపెనింగ్స్ కి నోచుకోలేదు.
మే ఒకటిన గాయపడ్డ సింహంగా మరోసారి సోలో హీరో అవతారం ఎత్తాడు తరుణ్ భాస్కర్. పెద్ది ఎలాగూ వాయిదా పడుతుందన్న ధీమాతో రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడం బిజినెస్ పరంగా చాలా ప్లస్ అవుతోంది. థియేటర్ల అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. అయిదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగుతున్న ఈ సింహంకి ఓటిటి, డిజిటల్ రూపంలో పది కోట్ల దాకా ఆదాయం వచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. ఇది నిజమైన పక్షంలో నిర్మాత సేఫ్ గా ఉండటంతో పాటు లాభాలు అందుకున్నట్టే.
నటనని ఇంత సీరియస్ గా తీసుకున్న తరుణ్ భాస్కర్ కు గాయపడ్డ సింహం రూపంలో గతంలో తగిలిన గాయాలకు మందు దొరకాలి. ఎందుకంటే సరైన బ్రేక్ దక్కితే మరిన్ని ఆఫర్లు వస్తాయి. ఈ సినిమాకు లక్కు కూడా కలిసి వస్తోంది. ముందు వెనుక చెప్పుకోదగ్గ పోటీ లేదు. సమంత మా ఇంటి బంగారం, సితార బ్యానర్ వీసాలు ట్రై చేశాయి కానీ సమయం సరిపోకపోవడంతో వస్తాయా రావా అనే సందిగ్ధత నెలకొంది. స్వయంభు సైతం పోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల పెద్ది డేట్ తీసుకోలేకపోయింది.
ఇన్ని సానుకూలతల మధ్య గాయపడ్డ సింహం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ డ్రామాలో జెడి చక్రవర్తి ఒక ముఖ్య పాత్ర పోషించగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. అంచనాల పరంగా మరీ ఎత్తులో లేదు కానీ ఒక క్రమపద్ధతిలో ప్రమోషన్లు చేయడం ద్వారా బజ్ పెంచే ప్లానింగ్ లో ఉన్నారు నిర్మాత పవన్ సాధినేని. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ నగరానికి ఏమైంది 2 ప్రస్తుతం విదేశీ షూటింగ్ లో ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
